జాయ్ జమీమా మోసాలు మామూలుగా లేవు.. ఆమె చీటింగ్ చిట్టా.. రాస్తే పుస్తకం.. తీస్తే సీరియల్ అవుతుంది… ఇలా హనీట్రాప్ కేసు దుమ్ముదులుతున్నారు విశాఖ పోలీసులు. జమిమా ముఠా సభ్యుడు వేముల కిషోర్ను అరెస్ట్ చేశారు. కారు డెకార్స్ బిజినెస్ చేస్తున్న కిశోర్ జాయ్ జమిమా ముఠాలో పనిచేస్తున్నాడు. కంచరపాలెం కేసులో బాధితుడిని ఆయన కుటుంబసభ్యులను బెదిరించాడు కిశోర్. జమిమాతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలను బాధితుడి కుటుంబసభ్యులకు చూపించి డబ్బు డిమాండ్ చేశాడు కిశోర్. ఈ బెదిరింపులకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కిశోర్ను అరెస్ట్ చేశారు పోలీసులు.. ప్రస్తుతం పోలీసులు కిశోర్ను విచారిస్తున్నారు. ముఠాలో మొత్తం ఎంతమంది ఉన్నారు? నిందితురాలు జాయ్ తో కలిసి ఎంతమందిని మోసం చేశారన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. త్వరలో మిగతా నిందితులను అరెస్ట్ చేయనున్నారు.
జమిమా బాధితులు విశాఖ, హైదరాబాద్ లోనే కాదు దేశమంతటా ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా కోల్కతాకు చెందిన బాధితుడు విశాఖ పోలీసులను ఆశ్రయించాడు. తాను జమిమా చేతిలో మోసపోయానని ఫిర్యాదు చేశాడు. త్వరలో విశాఖకు వచ్చి వాంగ్మూలం ఇవ్వనున్నాడు.
హనీ ట్రాప్ కేసులో ఓ అటవీ శాఖ అధికారికి సంబంధం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి సదరు అధికారిని ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్లో పోలీసులు విచారించినట్టు సమాచారం..
జాయ్ జమిమా టార్గెట్ ధనవంతులు, వ్యాపారులే. బెదిరింపులకు లొంగనివారిపై రేప్ కేసులు పెట్టింది జమిమా.. 10 నెలల కిందట బాధితుడిపై స్థానిక పోలీసుస్టేషన్లో రివర్స్ కేసు పెట్టింది. ఇప్పుడు ఆ వ్యక్తి తాను జమిమా బాధితుడినని ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఖంగుతిన్నారు. హనీట్రాప్ బాధితులు భయంలేకుండా ముందుకు వస్తే న్యాయం చేస్తామంటున్నారు పోలీసులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..