ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం అవుతుంది. అయితే ఇప్పటి నుంచే ఎన్నికలపై రాజకీయ పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. ఎలాగైనా అధికారం చేపట్టాలనే కాంక్షతో ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. మళ్లీ అధికారంలోకి రావాలని వైసీపీ సర్కార్ భావిస్తుండగా.. ఎలాగైనా పగ్గాలు చేపట్టాల్సిందేనని టీడీపీ నేతలు(TDP Leaders) ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అటు జనసేన కూడా గెలుపు తమదేనన్న ధీమా వ్యక్తం చేస్తోంది. బీజేపీ సైతం పోరుకు సై అంటోంది. ఈ క్రమంలో రెండేళ్ల ముందే రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకోవడం ఆసక్తికరంగా మారింది. వచ్చే ఎన్నికల్లో(AP Assembly Elections) టీడీపీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని బలపరిచే విధంగా ప్రత్యేక వ్యూహ రచనలు చేయాలన్నారు. రాష్ట్రాన్ని అథోగతిపాలు చేస్తున్న ముఖ్యమంత్రికి ప్రజలు బుద్ధిచెప్పే సమయం తొందరలోనే ఉందని హెచ్చరించారు.
విరామం లేకుండా మరింత దూకుడుగా పోరాటాలు చేయాలని పార్టీ శ్రేణులకు గతంలో చంద్రబాబు సూచించిన విషయం తెలిసిందే. ఒంగోలు మహానాడు ప్రజా విజయంగా చంద్రబాబు అభివర్ణించారు. అరాచక, విధ్వంస పాలనపై తిరుగుబాటుకు మహానాడు వేదిక అయ్యిందన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్.. రాజకీయాలకే అనర్హుడని మండిపడ్డారు. ‘క్విట్ జగన్- సేవ్ అంధ్రప్రదేశ్’ నినాదాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఎన్నికలకు 6 నెలల ముందు కనిపించే స్పందన.. రెండేళ్ల ముందే కనిపించిందని వెల్లడించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి