నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం వాయువ్య దిశగా 15 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. చెన్నైకి 320 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 350 కిలోమీటర్లు, నెల్లూరుకి 400 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైందని చెప్పారు. ఈ ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని రోణంకి కూర్మనాథ్ వివరించారు. గురువారం తెల్లవారుజామున చెన్నై దగ్గర వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందన్నారు.
🔸నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం
🔸చెన్నైకి 280 కి.మీ., పుదుచ్చేరికి 320 కి.మీ, నెల్లూరుకి 370కి.మీ దూరంలో కేంద్రీకృతం
🔸పశ్చిమ వాయువ్య దిశగా 15కిమీ వేగంతో కదులుతున్న వాయుగుండం
🔸దక్షిణకోస్తా, రాయలసీమలో కొన్ని చోట్ల భారీ నుండి అతిభారీ వర్షసూచన
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) October 16, 2024
పలుచోట్ల తీవ్రభారీ వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసినట్లు రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఈ మేరకు విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు (ఫ్లాష్ ఫ్లడ్) సంభవించే అవకాశం ఉందన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పెన్నా నది పరీవాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని రోణంకి కూర్మనాథ్ సూచించారు.
ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, జిల్లా యంత్రాంగానికి తీవ్రతను బట్టి సూచనలు జారీ చేస్తున్నామని రోణంకి కూర్మనాథ్ వివరించారు. ఇప్పటికే సహాయక చర్యల కోసం కోటి రూపాయల చొప్పున జిల్లాలకు అత్యవసర నిధులు ఇచ్చామన్నారు. నెల్లూరు, తిరుపతి, కర్నూలు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో 5 ఎస్డీఆర్ఎఫ్, 2 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రకాశం జిల్లాలో 4 మండలాల్లో, నెల్లూరులో 6, అన్నమయ్య జిల్లాలో 3 మండలాల్లో ఎక్కువ ప్రభావం ఉంటుందన్నారు. అవసరమైన చోట 15 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. సముద్రంలో వేటకు వెళ్లిన 61,756 మంది మత్స్యకారులను వెనక్కి రప్పించామని రోణంకి కూర్మనాథ్ తెలిపారు. కాగా వర్ష ప్రభావిత జిల్లాల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు తెలుసుకుని.. అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..