అమ్మో..! విహారంలో నిర్లక్ష్యం.. యాత్రికుల ప్రాణాలకు భద్రతేది..?

| Edited By: Srikar T

Feb 26, 2024 | 4:22 PM

కృష్ణానది జలవిహారం చేయాలంటేనే పర్యాటకులు బేంబేలు ఎత్తిపోతున్నారు.. డబ్బులు దోచుకుంటున్నారే కాని సరైన భద్రతను కల్పించలేకపోతుంది పర్యాటక శాఖ. గతంలో కృష్ణ నదిలో ఎన్నో సార్లు బోట్ల ప్రమాదాలు జరిగినా అధికారులు ఏమి పట్టనట్టే వ్యహరిస్తున్నారు. భద్రత చర్యలు తీసుకుని పర్యాటకులను రక్షించాలిసిన అధికారులే బోట్లు, భద్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు.

అమ్మో..! విహారంలో నిర్లక్ష్యం.. యాత్రికుల ప్రాణాలకు భద్రతేది..?
Vijayawada Boating
Follow us on

కృష్ణానది జలవిహారం చేయాలంటేనే పర్యాటకులు బేంబేలు ఎత్తిపోతున్నారు.. డబ్బులు దోచుకుంటున్నారే కాని సరైన భద్రతను కల్పించలేకపోతుంది పర్యాటక శాఖ. గతంలో కృష్ణ నదిలో ఎన్నో సార్లు బోట్ల ప్రమాదాలు జరిగినా అధికారులు ఏమి పట్టనట్టే వ్యహరిస్తున్నారు. భద్రత చర్యలు తీసుకుని పర్యాటకులను రక్షించాలిసిన అధికారులే బోట్లు, భద్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. పర్యాటకుల దగ్గర అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి పర్యాటకుల ప్రాణాలను ప్రమాదంలో పెడుతున్నారు. విజయవాడ కృష్ణా నది పర్యాటక ప్రాంతంలో ప్రైవేటు బోట్లకు సవాలక్ష నిబంధనలు చెప్పే అధికారులు తమ బోట్లకు మాత్రం నిబంధనలు పాటించడం లేదు. కృష్ణానదిలో తిరిగే పర్యాటక బోట్లలో చాలా వరకు మారిటైమ్‌ బోర్డు అనుమతులు లేవు. ఇరిగేషన్‌ అనుమతులు కూడా లేవు. బోట్ల ఇన్సూరెన్స్‌ గడువు కూడా ముగిసిపోయింది. కృష్ణా, గోదావరి నదులలో జరిగిన బోటు ప్రమాదాల అనంతరం పర్యాటకాభివృద్ధి సంస్థ బోట్ల అనుమతుల కోసం నిబంధనలను తీసుకొచ్చింది. కానీ అవి కాగితాలకే పరిమితమయ్యాయి. ఈ నిబంధనలను తుంగలో తొక్కి అడ్డగోలుగా తిప్పుతోంది కూడా ఏపీటీడీసీనే కావటం గమనార్హం.

కృష్ణానదిలో జల విహారానికి సంబంధించి ఏపీటీడీసీకి చెందిన ధరణి పాంటూన్‌ (10 + 2 సీటింగ్‌), పోలిక్రాఫ్ట్‌ (2+1), జలజాక్షి (10+2), ఆమరపాలి (32+4), జగదాంబ (18+4), క్రిష్ణవేణి (29+4), భవాని (31+4), బోధిసిరి డబుల్‌ డెక్కర్‌ క్రూయిజర్‌ (96+4) బోట్లు ఉన్నాయి. పోర్టు ఎన్‌ఓసీలు ఉంటే తప్ప వీటిని నడపకూడదు. మారిటైమ్‌ బోర్డు నుంచి నిరభ్యంతర పత్రాలు రావాలంటే.. అనేక అంశాలను చూస్తారు. బోట్లను తయారు చేసిన కంపెనీ, బోట్ల దుర్భేద్యత, బోట్ల నాణ్యత, నీటి ఉధృతిని తట్టుకునేలా ఉండటం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని తనిఖీలు చేసిన తర్వాతే.. వాటికి పోర్టు ఎన్‌వోసీలను మంజూరు చేస్తారు. ఎన్‌వోసీలు వచ్చిన తర్వాత ఇరిగేషన్‌ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి. పైన చెప్పుకున్న బోట్లలో చాలా వాటికి పోర్టు అనుమతులు, ఇరిగేషన్‌ అనుమతులు ఏమి లేకుండా పర్యాటకశాఖ బోట్లను తిప్పుతున్నారు. ధరణి పాంటూన్‌ బోటుకు 2023 ఫిబ్రవరి 14 నాటికి పోర్టు ఎన్‌వోసీ గడువు ముగిసింది. మళ్లీ ఈ బోటుకు మారిటైమ్‌ బోర్డు ద్వారా పరీక్షలు నిర్వహించి ఎన్‌వోసీ తెచ్చుకున్నాకే కృష్ణానదిలో నడపాల్సి ఉండగా.. ఎలాంటి అనుమతులూ లేకుండానే బోటును నడిపేస్తున్నారు.

పోలిక్రాఫ్ట్‌ బోటుకు కూడా పోర్టు ఎన్‌వోసీ, ఇరిగేషన్‌ అనుమతులు లేవు. 2023 ఫిబ్రవరి 14 నాటికి దీనికి ఉన్న ఎన్‌వోసీ గడువు కూడా అయిపోయింది. జగదాంబ బోటుకు అక్టోబరు 2024 వరకే ఎన్‌వోసీ గడువు ఉంది. ఇప్పటి వరకు దీని ఎన్‌వోసీని పర్యాటక అధికారులు రెన్యువల్‌ చేయలేదు. ఇక ప్రధానమైన బోట్ల విషయానికి వస్తే క్రిష్ణవేణి ఉంది. ఈ బోటుకు 2024 జనవరి 19 తో పోర్టు ఎన్‌వోసీ అనుమతి ముగిసిపోయింది. దీనికి ఎలాంటి ఇరిగేషన్‌ అనుమతి లేదు. ఈ బోటుకు రూట్‌ పర్మిషన్‌ కూడా 2024 జనవరి 19 నాటికి ముగిసిపోయింది. మరో ప్రధానమైన మెకనైజ్డ్‌ బోటు భవాని. ఈ బోటుకు కూడా జనవరి 19 నాటికి పోర్టు అనుమతి ముగిసింది. ఇరిగేషన్‌ అనుమతి కూడా లేదు. ఈ బోటుకు రూట్‌ పర్మిషన్‌ జనవరి 19కి అయిపోయినా, ఇప్పటికి పర్యాటక శాఖ బోటును నడుపుతునే ఉన్నారు. అత్యంత ప్రధానమైన బోధిసిరి డబుల్‌ డెక్కర్‌ క్రూయిజర్‌ బోటుకు కూడా 2024 ఏప్రిల్‌ 3 వరకే అనుమతి ఉంది. బోధిసిరికి ఇప్పటి వరకు ఇరిగేషన్‌ అనుమతి కూడా లేదు. ఇరిగేషన్‌శాఖ నుంచి కూడా అనుమతులు, క్లియరెన్సు తీసుకోకుండానే బోట్లను నడిపేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

గోదావరి నదిలో బోటు మునిగిపోయినపుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏడాది పాటు బోటింగ్‌ కలాపాలు నిలిపివేశారు. కృష్ణానదిలో కూడా నిలుపుదల చేశారు. పోర్టు ఎన్‌వోసీలు, ఇరిగేషన్‌ అనుమతులు, పర్యాటకుల సేఫ్టీ అరేంజ్‌మెంట్స్‌, కంట్రోల్‌రూమ్‌లు వంటివి ఏర్పాటు చేశాక మాత్రమే అనుమతులు ఇచ్చారు. ఇప్పుడు అలాంటివేమీ లేకపోయినా.. బోట్లను నడిపేస్తున్నారు. బోట్లలో ప్రమాదవశాత్తూ ఏదైనా ఫైర్‌ సంభవించినా.. తగలబడిపోతున్నా.. ముందుగా రక్షించేది ఫైర్‌ ఎగ్జింట్వింగిషర్స్‌ (నిప్పును ఆర్పే పరికరాలు). ఆఖరికి ఇవి కూడా గడువు దాటి పోయాయి. మొత్తం 34 ఫైర్‌ ఎగ్జింట్వింగిషర్స్‌ ఉండగా.. అన్నిటికి జనవరి 11, 2024 నాటికి గడువు ముగిసిపోయాయి. ఇవి పనిచేయకపోతే పర్యాటకుల ప్రాణాలకే ప్రమాదం సంభవిస్తుంది. ఇంత జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఏమీ పట్టనట్టే అద్వానంగా వ్యవహారిస్తుంది. ఆహ్లాద విహారానికి వచ్చే పర్యాటకులు సరైన భద్రత లేక ఇబ్బందులు పడుతు భయబ్రాంతులజు గురి అవుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…