AP Elections 2024: కలిసిమెలిసి పనిచేయాల్సిన కూటమి నేతలు అక్కడ మాత్రం తలోదారి..!
వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది. సీట్ల కేటాయింపు ఎలా జరిగిందనే దానిపై తెలుగుదేశం, జనసేన పార్టీ నేతలు క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో ఎలా పనిచేయాలనే దానిపైనా కేడర్కి దిశానిర్దేశం చేశారు. అయితే కలిసి మెలిసి పనిచేయాల్సిన కూటమి నేతలు అక్కడ మాత్రం తలోదారి అన్నట్లు మారారు.
వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది. సీట్ల కేటాయింపు ఎలా జరిగిందనే దానిపై తెలుగుదేశం, జనసేన పార్టీ నేతలు క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో ఎలా పనిచేయాలనే దానిపైనా కేడర్కి దిశానిర్దేశం చేశారు. అయితే కలిసి మెలిసి పనిచేయాల్సిన కూటమి నేతలు అక్కడ మాత్రం తలోదారి అన్నట్లు మారారు. ఓట్లు చీలకూడదు, అందరూ కలిసిమెలిసి పనిచేయాలని అధినేతలు హెచ్చరిస్తుంటే, అక్కడ మాత్రం ఆ పరిస్థితి మచ్చుకైనా కనిపించడం లేదు. పొత్తులో భాగంగా సీటు దక్కించుకున్న జనసేన, టిక్కెట్ దక్కని టీడీపీ నేతలు ఎవరి దారిన వారు వెళ్తూ పొత్తు ధర్మాన్ని ప్రక్కనపెడుతున్నారన్న చర్చ జోరుగా నడుస్తోంది. ఇంతకీ అసలు ఆ నియోజకవర్గంలో ఏమి జరుగుతుంది? టీడీపీ, జనసేన మధ్య గందరగోళానికి కారణాలేంటి? వారి మధ్య సయోధ్య కుదిరేనా? అన్న చర్చ మొదలైంది.
విజయనగరం జిల్లా నెల్లిమర్ల కూటమిలో విచిత్ర రాజకీయం చోటుచేసుకుంది. నెల్లిమర్ల నియోజకవర్గం మొదటి నుండి టీడీపీకి కంచుకోట. ఆ పార్టీకి బలమైన క్యాడర్, ఓట్ బ్యాంక్ ఉన్న నియోజకవర్గం నెల్లిమర్ల. ఇక్కడ టిక్కెట్ కోసం ఇంచార్జి కర్రోతు బంగార్రాజు తోపాటు అనేక మంది పోటీ పడ్డారు. అయితే పొత్తులో భాగంగా నెల్లిమర్లను జనసేనకు కేటాయించింది టీడీపీ. దీంతో ఇక్కడ జనసేన నేత లోకం నాగమాధవికి టిక్కెట్ దక్కింది.
లోకం నాగమాధవి ఆర్థికంగా బలమైన నేత. వ్యాపారవేత్త. 2019 ఎన్నికల్లో కూడా ఇక్కడ నుండి జనసేన తరుపున పోటీచేసి కేవలం 7,350 ఓట్లు దక్కించుకుని ఓటమి పాలయ్యారు. ఇప్పుడు మరోసారి కూటమి అభ్యర్ధిగా బరిలో దిగుతున్నారు నాగమాధవి. అయితే కూటమి అభ్యర్థిగా నాగమాధవికి టిక్కెట్ కేటాయించడంతో ఇక్కడ టీడీపీ శ్రేణులు భగ్గుమన్నారు. బలమైన ఓటు బ్యాంక్ ఉన్న నెల్లిమర్లను జనసేనకు కేటాయించడం ఏంటని అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. ఒకానొక సందర్భంలో టీడీపీ ఇంచార్జి బంగార్రాజు ఇండిపెండెంట్గా పోటీ వేసేందుకు కూడా సిద్ధమయ్యారు.
అయితే ఆ తరువాత పరిణామాల నేపథ్యంలో టీడీపీ అధిష్టానం అసంతృప్తులతో మాట్లాడి జనసేన గెలుపు కోసం పనిచేయాలని సూచించింది. దీంతో చేసేదిలేక తప్పనిసరి పరిస్థితుల్లో పొత్తు ధర్మంలో భాగంగా జనసేన గెలుపు కోసం పనిచేసేందుకు ఇంచార్జి జంగార్రాజుతో పాటు ఇతర నేతలు కూడా సిద్ధమయ్యారు. నిన్నమొన్నటి వరకు జనసేనకు దూరంగా ఉన్న టీడీపీ నేతలు ఇప్పుడిప్పుడే దగ్గరవుతుంటే జనసేన అభ్యర్థి లోకం నాగ మాధవి మాత్రం వారిని కలుపుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి.
ఇక్కడ దశాబ్దాలుగా పనిచేస్తున్నా మాజీమంత్రి పతివాడ నారాయణస్వామి నాయుడు కుటుంబానికి కానీ, ఇంచార్జి కర్రోతు బంగార్రాజు, కంది చంద్రశేఖర్లను సైతం ప్రక్కన పెట్టి తమ సొంత ఎజెండాతో రాజకీయాలు చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. జనసేన పొత్తుతో దశాబ్దాలుగా టీడీపీని నమ్ము్కుని ఉన్న తమకు అన్యాయం జరిగిందని, పొత్తు ధర్మం కోసం పనిచేద్ధామంటే అభ్యర్థి తమను పట్టించుకోకుండా అవమానిస్తున్నారని లోలోన కుమిలిపోతున్నారట టీడీపీ నేతలు. ప్రచారం కోసం గ్రామాల్లోకి వెళ్తున్నా తమకు కనీసం సమాచారం ఉండటం లేదని, మాట వరుసకు కూడా తమను పిలవకుండా వెళ్తున్నారని, ఇలా అయితే తమకు ఏమి విలువ ఉంటుందని మధనపడుతున్నారట ఇక్కడి తెలుగుదేశం పార్టీ నాయకులు.
అంతేకాకుండా పలు గ్రామాల్లో టీడీపీ క్యాడర్ను కూడా జనసేనలోకి కలుపుకుని భవిష్యత్తులో నియోజకవర్గ టీడీపీ వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాగమాధవి జాగ్రత్త పడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. అవకాశం ఉన్నంత వరకు టీడీపీ నుండి బలమైన నేతలను జనసేనలోకి కలుపుకుని టీడీపీని నిర్వీర్యం చేసి తద్వారా వ్యక్తిగతంగా తమకు సొంత క్యాడర్ ను తయారుచేసుకోవచ్చన్న వ్యూహంతో జనసేన అభ్యర్థి పనిచేస్తున్నరన్న విమర్శలు ఉన్నాయి. పొత్తు అంటే కలిసి పనిచేయడం అని, అలాకాకుండా పొత్తులో ఉన్న పార్టీ క్యాడర్ ను తమ పార్టీలో కలుపుకొని టీడీపీకి నష్టం చేయడం కాదని అంటున్నారు ఆ పార్టీ నేతలు.
రాష్ట్రస్థాయిలో టీడీపీ, జనసేన అధినేతలు ఇద్దరు కలిసి మెలిసి పనిచేస్తూ బహిరంగ సభల ద్వారా క్యాడర్ ను ఉత్తేజపరుస్తుంటే నెల్లిమర్లలో మాత్రం అందుకు భిన్నంగా ఉండటం టీడీపీ క్యాడర్ ను అయోమయానికి గురిచేస్తోంది. ఏది ఏమైనా ఇదే తరహా రాజకీయాలతో అభ్యర్థి లోకం నాగమాధవి ముందుకు వెళ్తే పరాజయం తప్పదని అంటున్నారు కూటమి కార్యకర్తలు..!
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…