మన్యం గజరాజుల కోసం కదిలిన కొమురంపులి.. ఏనుగుల తరలింపు సాధ్యమేనా..?

| Edited By: Balaraju Goud

Aug 06, 2024 | 12:00 PM

పార్వతీపురం మన్యం జిల్లాలో ఏళ్ల తరబడి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఏనుగుల సమస్య త్వరలో పరిష్కారం అవుతుందా? అవుననే అనిపిస్తుంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని ఏనుగుల సమస్యకు పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం అటవీశాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ముమ్మర కసరత్తు చేస్తున్నారు.

మన్యం  గజరాజుల కోసం కదిలిన కొమురంపులి.. ఏనుగుల తరలింపు సాధ్యమేనా..?
Elephants
Follow us on

పార్వతీపురం మన్యం జిల్లాలో ఏళ్ల తరబడి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఏనుగుల సమస్య త్వరలో పరిష్కారం అవుతుందా? అవుననే అనిపిస్తుంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని ఏనుగుల సమస్యకు పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం అటవీశాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఇదే అంశం మన్యం జిల్లావాసుల్లో ఇప్పుడు కొత్త ఆశలు రేపుతుంది.

ఏనుగుల గుంపు పార్వతీపురం మన్యం జిల్లావాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సాయంత్రం ఐదు తర్వాత ఇంట్లో నుండి బయటకు రావాలంటేనే భయంతో వణికిపోతున్నారు. నిత్యం సంచరించే ఏనుగుల గుంపు ఎప్పుడు, ఎక్కడ ఉంటాయో? ఎవరిపై ఎలా దాడి చేస్తాయో తెలియక బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో సంచరిస్తున్న ఆరు ఏనుగులతోనే జిల్లావాసులు భయం భయంగా బతుకుతుంటే ఇప్పుడు కొత్తగా శ్రీకాకుళం జిల్లా నుండి మరో నాలుగు ఏనుగుల గుంపు జిల్లాకు చేరుకుంది.

అలా వచ్చిన ఏనుగుల గుంపు కురుపాం మండలం జరడలో సంచరిస్తూ పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయి. గిరిజనులు పండిస్తున్న రాగులు, జొన్నలతో పాటు ఇతర చిరు ధాన్యాల పంటలను కూడా నాశనం చేస్తున్నాయి. కొత్తగా వచ్చిన ఏనుగులు గుంపు ప్రవర్తన కూడా భయానకంగా ఉండటంతో స్థానికులు వణికిపోతున్నారు. ఏనుగులను ఈ ప్రాంతం నుండి తరలించాలని ఏళ్ల తరబడి జిల్లావాసులు డిమాండ్ చేస్తున్న ఫలితం మాత్రం కనిపించలేదు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏనుగుల తరలింపు పై ముమ్మర కసరత్తు చేస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఎలాగైనా ఏనుగులను తరలించాలని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు అటవీశాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్. ఏనుగుల తరలింపుకు ప్రత్యేక శిక్షణ పొందిన కుంకీ ఏనుగులను తీసుకువచ్చి వాటి సహాయంతో తిరిగి ఒడిశాలోని లఖేరి అటవీ ప్రాంతానికి తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అన్ని రకాలుగా ప్రత్యేక శిక్షణ పొందిన ఏనుగులను కుంకీ ఏనుగులు అంటారు. ఇవి రెచ్చిపోతున్న ఏనుగులను మచ్చిక చేసుకుని అటవీ ప్రాంతానికి తీసుకెళ్తాయి.

అలాంటి కుంకీ ఏనుగులు జిల్లాకు తీసుకురావడానికి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? కుంకీ ఏనుగులు జిల్లాకు తీసుకువస్తే వాటికి ఆశ్రయం ఎక్కడ కల్పించాలి? కుంకీ ఏనుగులకు జిల్లాలో సంచరిస్తున్న పది ఏనుగులను మచ్చిక చేసుకోవడం సాధ్యమేనా? ఈ ఆపరేషన్ చేయడానికి ఎంత ఖర్చవుతుంది? అందుకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన పరిస్థితి ఏంటి? ఇలా అనే అనేక అంశాల పై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఇప్పటికే ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వం అనుకున్నది అనుకున్నట్టు జరిగితే మరికొద్ది నెలల్లో ఏనుగుల తరలింపు ప్రతిపాదనలు కార్యరూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే మన్యం జిల్లావాసులకు గొప్ప ఊరట అనే చెప్పవచ్చు..!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…