ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారు. సచివాలయంలోని సీఎం చాంబర్కు నేరుగా వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు సీఎం చంద్రబాబు సాదరంగా ఆహ్వానం పలికారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి సెక్రటేరియట్లోని తన ఛాంబర్కు వచ్చిన పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి ఆలింగనం చేసుకున్నారు. అందరూ సంతోషంగా నవ్వుతూ మాట్లాడుకున్నారు. పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కూడా సీఎం చంద్రబాబును కలిశారు. పలు కీలక అంశాలపై చర్చించారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చాంబర్లో ఉన్న ప్రభుత్వ అధికారిక చిహ్నాన్ని చూపించి.. ఈ గుర్తుకు తమరు హుందాతనాన్ని తెచ్చారన్నారు. దానికి సీఎం చంద్రబాబు పవన్ కు ధన్యవాదాలు తెలిపారు. సచివాలంలోని సీఎం చాంబర్ లో పవన్ కళ్యాణ్, చంద్రబాబును కలవడం ఇది రెండవసారి. గతంలో ఉద్దానం బాధితులకు సాయం కోరేందుకు తొలిసారి ఇదే చాంబర్ లో కలిసి సమస్యలు విన్నవించారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో మరోసారి కలిసి మాట్లాడారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో పిఠాపురం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనకు ఏపీ సీఎం చంద్రబాబు ఉపముఖ్యమంత్రి హోదాతో పాటు పలు శాఖలకు మంత్రులుగా నియమించారు. ఆ తరువాత ఏపీ సచివాలయానికి చేరుకున్నారు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన సచివాలయానికి చేరుకున్న వెంటనే సెక్రటరీలు, పోలీసు ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. సచివాలయంలో అడుగు పెట్టిన వెంటనే పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. ఆ తరువాత సచివాలంలోని తన ఛాంబర్ను పరిశీలించారు. ఇదిలా ఉంటే గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి అమరావతి మీదుగా సచివాలయానికి చేరుకునే మార్గం మొత్తం అభిమానులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దారిపొడవునా పూలు వేస్తూ గజమాలలతో ఘనస్వాగతం పలికారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..