Minister vs VRO’s: వీఆర్వోలు సచివాలయాలకు వస్తే వారిని తరమాలంటూ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మంత్రి తీరుపై వీఆర్వోలతో పాటు తహసీల్దార్లు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. సమావేశానికి పిలిచి అవమానించడం తగదని, కలెక్టర్ వద్దే తేల్చుకుంటామన్నారు. వీఆర్వోల సంఘం కూడా మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. తక్షణమే క్షమాపణ చెప్పాలని, లేదంటే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని ఏపీవీఆర్వోల సంఘం ప్రకటించింది. మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వోలు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులోనూ ఎమ్మార్వో కార్యాలయం ముందు విఆర్వోలు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో వీఆర్వోలకు అవమానం జరిగిందని.. తక్షణమే మంత్రి అప్పలరాజు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
వన్టైమ్ సెటిల్మెంట్ అమలు తీరుపై బుధవారం శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో నియోజకవర్గస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన వీఆర్వోలను పలాస-కాశీబుగ్గ మున్సిపల్ కమిషనర్ టి.రాజగోపాలరావు బయటికి పొమ్మన్నారు. తమను పిలిచి ఎందుకు అవమానిస్తున్నారని ప్రశ్నించగా.. మరింత కటువుగా మాట్లాడారనేది వీఆర్వోల ఆరోపణ. అంతలో అక్కడికి వచ్చిన మంత్రికి జరిగిన విషయాన్ని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తే.. ఆయన కూడా అసహనం వ్యక్తంచేశారు. ‘రాజకీయం చేయడానికి వచ్చారా? ఉద్యోగానికి వచ్చారా?’ అంటూ మండిపడ్డారు. అంతే కాకుండా వీఆర్వోలు సచివాలయాలకు వస్తే.. సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు వారిని తరమాలంటూ పిలుపునిచ్చారు. వీఆర్వోలను కట్టడి చేయలేని అధికారులు ఎందుకని తహసీల్దార్లను నిలదీయడం వివాదాస్పదంగా మారింది.
Also read:
HMDA: మూసీ తీరంలో కాసుల వర్షం.. ఉప్పల్ భగాయత్ గజం ఎంతో తెలుసా..
Hebah Patel: హెబ్బా పటేల్ను ఇలా ఎప్పుడైనా చూసారా ?? ఆకట్టుకుంటున్న కుమారి లేటెస్ట్ ఫొటోస్