Andhra Pradesh: పశువుల్లో లంపి స్కిన్ వైరస్పై ఏపీ సర్కారు అలర్ట్ అయ్యింది. రాష్ట్రంలో ప్రతి పశువును ఈ వ్యాధి నుంచి కాపాడాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. పశువులను పట్టి పీడిస్తోన్న ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీచేసింది. లంపీ వైరస్తో ఏ ఒక్క పశువు కూడా మృతి చెందకూడదన్న లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా పశువులకు వ్యాక్సినేషన్ ముమ్మరం చేసింది పశుసంవర్ధక శాఖ. ముందు జాగ్రత్త చర్యగా పశువుల సంతలను నిలిపివేసింది. వైరస్ కట్టడిలో భాగంగా రెండు లక్షలకు పైగా పశువులు ఉన్న కోనసీమ జిల్లాపై ప్రత్యేక నిఘాపెట్టింది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అంబాజీపేట, ద్వారకాపూడి, ద్రాక్షారామంలో వారంతపు సంతలను నిలిపివేసింది.
ప్రధానంగా నల్ల, తెల్లజాతి పశువులకే ఈ వైరస్ సోకుతుండడంతో స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎక్కడికక్కడ పశువులకు వ్యాక్సినేషన్ చేస్తున్నారు. ప్రతి పశువును కాపాడడమే తమ లక్ష్యమంటున్నారు జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి మూర్తి. పశువుల పాకలను పరిశుభ్రంగా ఉంచాలని కోరుతున్నారు వైద్యులు. క్రిమి కీటకాలు దరి చేరకుండా చూడాలని సూచిస్తున్నారు. జాగ్రత్తలు పాటిస్తే.. వైరస్బారి నుంచి పశువులను కాపాడుకోవచ్చంటున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..