సిని హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నంద్యాలలో తనపై నమోదైన కేసు విషయంలో అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసును కొట్టి వేయాలని అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
తనపై నమోదైన కేసు విచారణకు ముందే కేసును రద్దు చేయాలని బన్నీ హైకోర్టును కోరారు. ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాలలో ఎన్నిల ప్రచారంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో షూటింగ్ కోసం హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తూ నంద్యాలకు వచ్చిన బన్నీ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో నిలిచిన మిత్రుడు శిల్పా రవి ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే.
ఆ సమయంలో అల్లు అర్జున్ సుమారు గంటన్నరకు పైగా అక్కడే గడిపారు. కాసేపు మీడియాతో మాట్లాడి తిరుపతికి వెళ్లిపోయారు. అయితే ఈ సమయంలో బన్నీని చూసేందుకు వేలాదిగా అభిమానులు తరలి వచ్చారు. ఆ సమయంలో రవి ఇంటి ముదు పెద్ద హంగామా చేశారు. అయితే అల్లు అర్జున్ శిల్పారవి ఇంటికి వచ్చింది వ్యక్తిగతమైనా.. భారీగా ఫ్యాన్స్ వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.
అయితే ఎలాంటి అనుమతులు తీసుకోకపోవడంతో నంద్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు అల్లు అర్జున్తో పాటు శిల్పారవిపై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ కేసును కొట్టి వేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో బన్నీ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. మరి దీనిపై ధర్మాసనం ఎలా స్పందిస్తుందో చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..