Pak Monsoon Rains: పాకిస్థాన్లో రుతుపవనాల ప్రభావంతో గత ఐదు వారాలకు పైగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు ముంచెత్తుతున్నాయి. నదులు ఉప్పొంగుతున్నాయి. వర్షాలు, వరదలతో మరణించిన వారి సంఖ్య 304కి చేరుకుంది. ఈ విషయాన్ని అధికారులు ప్రకటించారు. జూన్ నెల మధ్య నుండి కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా అనేక రహదారులు, వంతెనలు దెబ్బతిన్నాయి. అంతేకాదు 9000 ఇళ్లు పూర్తిగా లేదా పాక్షికంగా దెబ్బతిన్నాయి. బలూచిస్థాన్ ప్రావిన్స్లో వర్షం, వరదల కారణంగా 99 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు .
సింధ్ ప్రావిన్స్లో 70 మంది చనిపోయారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లో కూడా 61 మంది మరణించారని, తూర్పు పంజాబ్ ప్రావిన్స్లో 60 మంది ప్రాణాలు కోల్పోయారని ఆ దేశ అధికారులు చెప్పారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. అదే సమయంలో, వర్షం, వరదల కారణంగా కనీసం 284 మంది గాయపడ్డారు.
దేశంలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక
రానున్న రోజుల్లో దేశంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పాకిస్థాన్ వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షాల కారణంగా, పాకిస్తాన్లోని అనేక నగరాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నీటి ఎద్దడి సమస్య తెలెత్తింది. భారీ వర్షాలు కురిస్తే.. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. మరో వైపు వరద సహాయక చర్యలు కొనసాగుతున్నాయని NDMA తెలిపింది. దేశవ్యాప్తంగా వర్షాలు, వరద బాధితులకు ఏజెన్సీ రేషన్ నీటిని అందిస్తోంది.
2010లో వరదల కారణంగా 2000 మంది ప్రాణాలు కోల్పోయారు
2010 సంవత్సరంలో కిస్తాన్లో వరదలు పెను విధ్వంసం సృష్టించాయి. అప్పట్లో సుమారు 2000 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో, 2 కోట్ల మందికి పైగా ప్రజలు నిర్వాసితులయ్యారు. 12 లక్షలకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. లక్షల హెక్టార్లలో పంటలు నాశనమయ్యాయన్న సంగతి తెలిసిందే.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..