ఆఫ్రికా దేశమైన సెనెగల్(Senegal) లో పెను విషాదం జరిగింది. వలసదారులతో ఐరోపా వెళ్తున్న బోటు ప్రమాదవశాత్తు సముద్రంలో బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 13మంది మృతిచెందినట్టు రెడ్ క్రాస్ అధికారులు వెల్లడించారు. దక్షిణ కాసామాన్స్ ప్రాంతంలోని కఫౌంటైన్ సమీపంలో సోమవారం రాత్రి ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో దాదాపు 150 మందికి పైగా ఉన్నారు. వీరిలో 91మందిని కాపాడామని, మరో 40మందికి పైగా గల్లంతైనట్టు సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది తెలిపారు. ఈ బోటులో మంటలు వ్యాపించడం వల్లే బోల్తా పడి ఈ దుర్ఘటన జరిగినట్టు వార్త కథనాలు వెల్లడయ్యాయి. అసలు ఈ దుర్ఘటనకు దారితీసిన కారణాలేంటి? ఈ బోటుకు, మైగ్రేషన్ ఆపరేషన్కు ఇన్ఛార్జి ఎవరు? అనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
పశ్చిమ ఆఫ్రికా తీర ప్రాంతం వెంబడి ఈ ప్రమాదకరమైన సముద్ర మార్గంలో చిన్న పడవల్ని తీసుకొని ఏటా అనేకమంది ఐరోపా వలస వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. గతేడాది ఆగస్టులో కూడా 60మందితో వెళ్తున్న ఓ బోటు సెనెగల్కు ఉత్తరాన ఉన్న సెయింట్ లూయిస్ వద్ద బోల్తా పడగా.. వీరిలో అనేకమంది మునిగిపోయారు.
మరిన్ని అంతర్జాయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..