టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సామాన్యులకు ప్రవేశం లేని ప్రగతిభవన్ను నక్సలైట్లు గడీలను గ్రానైడ్స్తో పేల్చినట్లు.. పేల్చివేయాలని.. ఇలా చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదంటూ పేర్కొన్నారు.. 2001లో పార్టీ పెట్టకముందు రబ్బరు చెప్పులులేని కేసీఆర్ కుటుంబ సభ్యులకు హైదరాబాద్ చుట్టూ వేల కోట్ల ఫామ్ హౌజ్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.. దీంతోపాటు మంత్రి కేటీఆర్పైనా విరుచుకుపడ్డారు రేవంత్రెడ్డి. పేదలకు ఇళ్లు కట్టివ్వలేనివాళ్లు హైదరాబాద్ నడిబొడ్డున పది ఎకరాల్లో విలాసవంతమైన భవనం నిర్మించుకుని భోగాలు అనుభవిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు రేవంత్. 2వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో 150 గదుల ప్యాలెస్ను ఎందుకు నిర్మించారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రగతిభవన్ను గడీలతో పోల్చిన రేవంత్… అక్కడ ఎప్పటికీ పేదలకు న్యాయం జరగదన్నారు.
తొమ్మిదేళ్ల పాలనలో 23 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన కేసీఆర్ ప్రభుత్వం ఆ సొమ్మంతా ఎక్కడికి మళ్లించారో ప్రజలకు చెప్పాలన్నారు. 2024 జనవరి 1 వరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వుంటుందని ధీమా వ్యక్తం చేసిన రేవంత్.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత పోడు రైతులకు పట్టాలు ఇచ్చే బాధ్యత తనదేనంటూ స్పష్టంచేశారు.
కాగా.. రేవంత్ రెడ్డి ప్రారంభించిన హాత్ సే హాత్ జోడో యాత్ర ములుగు జిల్లాలో ముగిసింది.. మేడారం సమ్మక్క-సారక్క దేవతల సన్నిధిలో ప్రారంభించిన పాదయాత్ర రెండోరోజు ములుగు జిల్లా కేంద్రానికి చేరుకుంది. ములుగు జిల్లాలో పాదయాత్ర ముగిసిన అనంతరం నర్సంపేటలో పాదయాత్ర చేపట్టాల్సి ఉండగా ఆ నియోజకవర్గ ఇంఛార్జ్ దొంతి మాధవరెడ్డి సహకరించకపోవడంతో రేవంత్ తన పాదయాత్రను మహబూబాబాద్ నియోజకవర్గానికి షిఫ్ట్ చేసుకున్నారు. బుధవారం పెనుగొండ నుంచి పాదయాత్ర చేయనున్నారు.
కాగా.. ప్రగతిభవన్ను గ్రెనైడ్తో పేల్చివేయాలన్న కామెంట్ను బీఆర్ఎస్ కుట్రగా అభివర్ణించింది. కేసీఆర్కు ప్రాణహాని తలపెట్టేలా నక్సలైట్లకు పిలుపునిచ్చారని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై ములుగు, నర్సంపేటల్లో బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదులు చేశారు. రేవంత్, సీతక్కపై కుట్ర కేసు నమోదు చెయ్యాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు పోలీస్ స్టేషన్లలో బీఆర్ఎస్ ములుగు అధ్యక్షుడు ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మహబూబాబాద్ పార్లమెంట్ పరిధి పాదయాత్రలో కాంగ్రెస్ నేతల మధ్య ఐక్యత లోపించడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ పాదయాత్ర రూట్ మ్యాప్ పై గందరగోళం నెలకొంది. రేవంత్ పాదయాత్రకు కొందరు సీనియర్లు, నియోజకవర్గ ఇంఛార్జ్లు సహకరించకపోవడంతో.. శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. నర్సంపేటలో రేవంత్ రెడ్డి పాదయాత్రకు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకరించకపోవడం కలకలం రేపింది. రేవంత్ పాదయాత్రకు దొంతి మాధవరెడ్డి దూరంగా ఉండటంతో.. నర్సంపేటలో నిర్వహించాల్సిన పాదయాత్రను మహబూబాబాద్ నియోజకవర్గానికి షిఫ్ట్ చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో దొంతి మాధవరెడ్డి తీరుపై రేవంత్ రెడ్డి తీవ్ర అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా.. రేవంత్ రెడ్డి మహబూబాబాద్ నియోజక వర్గంలో పాదయాత్రను కొనసాగించనున్నారు. కేసముధ్రం మండలం పెనుగొండ నుంచి పాదయాత్ర మొదలై ఈదులపూసపల్లి మీదుగా మహబూబూబాద్ పట్టణంలోకి ప్రవేశించనుంది. సాయంత్రం మహబూబూబాద్ లో కార్నర్ మీటింగ్ అనంతరం డోర్నకల్ నియోజకవర్గంలోని నరసింహులపేట మండలంలో నైట్ హాల్ట్ చేయనున్నారు. కాగా, BRS శ్రేణుల ఆందోళన నేపథ్యంలో రేవంత్ రెడ్డి పాదయాత్రకు అదనపు భద్రత కల్పించనున్నట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..