Telangana Guidelines: తెలంగాణ రాష్ట్రంలోకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కరోనా పేషెంట్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. తెలంగాణలోని ఆస్పత్రిలో బెడ్ కన్ఫర్మేషన్ తప్పనిసరి ఉండాలని ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ రోగి అ్మడిషన్ కంటే ముందే ఆస్పత్రి అనుమతి అవసరమని పేర్కొంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్లకు ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. 040- 2465119, 9494438351 నెంబర్లకు ఫోన్ చేయాలని స్పష్టం చేసింది.
అలాగే అంబులెన్స్ లేదా వాహనాలకు సైతం ముందస్తుగా అనుమతి తీసుకోవాలని సూచించింది. ఆస్పత్రులతో టై అప్ లేకుండా పేషెంట్లకు విలువైన సమయం వృథా అవుతుందని ప్రభుత్వం తెలిపింది. ఒక ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి తిరగడం వల్ల రోగి ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని తెలిపింది. అలాగే ఆస్పత్రులన్ని తిరగడం వల్ల కరోనా వ్యాప్తి చెందుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఎపిడమిక్ యాక్ట్ ద్వారా గైడ్లైన్స్ విడుదల చేశామని తెలంగాణ సర్కార్ స్పష్టం చేసింది.
కాగా, తెలంగాణలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండటంతో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్ని కరోనా పేషెంట్లతో నిండిపోయాయి. ఆస్పత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ వంటివి దొరకని పరిస్థితి ఉంది. దీంతో ఏపీ రాష్ట్రంలో పాటు ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ ఆస్పత్రులకు వస్తున్నారు. ముందే బెడ్ల కొరత, ఆక్సిజన్ తదితర సదుపాయాల కొరత ఉండటంతో వచ్చే పేషెంట్లకు మరింత ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో వారు ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వం ఈ గైడ్లైన్స్ విడుదల చేసింది.