తెలంగాణ బీజేపీలో సన్మానాల చిచ్చు మొదలైనట్లు జోరుగా చర్చ జరుగుతోంది. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి 8సీట్లు సాధించిన జోష్లో ఉంది బీజేపీ. ఢిల్లీలో బాధ్యతలు చేపట్టిన నేతలు ఎల్లుండి ఢిల్లీ నుంచి హైదరాబాద్కు రానున్నారు. బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి పార్టీ ఆఫీస్ దాకా.. కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్లను ఊరేగింపుగా తీసుకురావాలని నిర్ణయించింది. ఈ ఉత్సాహంలోనే నేతల మధ్య.. చిన్నపాటి చిచ్చు మొదలైనట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో నుంచి కేంద్ర మంత్రులుగా అవకాశం దక్కించుకున్న కిషన్రెడ్డి, బండి సంజయ్లకు.. ఎల్లుండి ఘనంగా సన్మానం చేయాలని పార్టీనేతలు నిర్ణయించారు. అయితే, కేవలం కేంద్ర మంత్రులకే సన్మానం ఎందుకు.. రాష్ట్రం నుంచి గెలిచిన బీజేపీ ఎంపీలందరికీ సన్మానం చేస్తే బాగుంటుందని పార్టీవర్గాలు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. నిజామబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సహా చాలామందిదీ ఇదే అభిప్రాయంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
బీజేపీ నుంచి గెలిచిన ఎంపీల్లో చాలామంది సీనియర్లు ఉన్నారు. ధర్మపురి అర్వింద్ నిజమాబాద్ నుంచి రెండోసారి గెలవగా.. మహబూబ్నగర్ నుంచి గెలిచిన డీకే అరుణ.. గతంలో రాష్ట్ర మంత్రిగానూ పనిచేశారు. చేవెళ్ల నుంచి గెలిచిన విశ్వేశ్వర్రెడ్డిది రెండోసారి విజయం కాగా.. మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్ భారీ మెజార్టీతో విక్టరీ కొట్టారు. గతంలో రాష్ట్ర మంత్రిగా రెండు పర్యాయాలు కీలకంగానూ వ్యవహరించారు ఈటల. ఆదిలాబాద్ నుంచి గెలిచిన గోడం నగేష్, మెదక్ నుంచి గెలిచిన రఘునందన్ కూడా సీనియర్ నాయకులే కావడం విశేషం. అయితే వాళ్ల గెలుపే కాదు, పార్టీకి కూడా జోష్ తెచ్చిన సీనియర్లను సన్మానించుకోవడం మంచి సాంప్రదాయం అని చెబుతున్నారు పార్టీలోని చాలామంది సీనియర్లు. మరి, ఈ సన్మానం చిచ్చు.. మంటలు రేపుతుందా? చల్లారుతుందా? చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..