తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ జిల్లా (Pargi Assembly Election) రాజకీయాలు ఈసారి రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా పరిగి నియోజవర్గంపై అన్ని పార్టీలు ప్రత్యేక ఫోకస్ చేశాయి. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే ప్రధానంగా తలపడ్డాయి. తాజాగా ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కూడా బరిలో నిలిచింది. దీంతో ఈసారి ఎన్నికల్లో అక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. పరిగి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీలో ఆశవహులు చాలా మంది ఉన్నా.. అధిష్టానం మాత్రం డీసీసీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డిపై మొగ్గుచూపింది. ఇక కాషాయ పార్టీ తరుఫున బూనేటి మారుతి కిరణ్ను బరిలో దింపింది.
పరిగి నియోజకవర్గంలో మొత్తం 2,59,422 ఓట్లు ఉన్నాయి. మొన్నటి పోలింగ్లో ఈ నియోజకవర్గంలో 76.53 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఈ నియోజకవర్గ పరిధిలో పరిగి, దోమ, పూడూర్, కుల్కచర్ల, చౌడాపూర్, గండీడ్, మహ్మదాబాద్తో పాటు ఒక మున్సిపాలిటి, 7 మండలాలు ఉన్నాయి.
పరిగి నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీలు ముందునుంచే ఫుల్ ఫోకస్ పెట్టాయి. గెలుపే లక్ష్యంగా పార్టీలన్నీ పావులు కదిపాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు తొమ్మిదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తోంది అధికార పార్టీ బీఆర్ఎస్. ఇక హస్తం పార్టీ ఆరు గ్యారంటీ స్కీంలపైనే గంపెడాశలు పెట్టుకుంది. కాషాయ దళం మాత్రం కేంద్రప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించి ఓటర్లను ఆకర్షించేందుకు విశ్వ ప్రయత్నం చేసింది.
2014, 2018 ఫలితాలు ఇలా..
2018 ఎన్నికల్లో కొప్పుల మహేశ్ రెడ్డి (టీఆర్ఎస్) ఇక్కడి నుంచి 15,840 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచారు. మహేశ్ రెడ్డికి 83,471 ఓట్లు పోల్ కాగా.. రామ్మోహన్ రెడ్డి (కాంగ్రెస్)కి 67,631 ఓట్లు దక్కాయి.
అంతకు ముందు 2014 ఎన్నికల్లో రాంమోహన్ రెడ్డి (కాంగ్రెస్) 5,163 ఓట్ల మెజార్టీతో ఇక్కడి నుంచి గెలిచారు. రామ్మోహన్ రెడ్డికి 68,098 ఓట్లు రాగా.. కొప్పుల హరీశ్వర్ రెడ్డి(టీఆర్ఎస్)కి 62,935 ఓట్లు పోల్ అయ్యాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్