Motkupalli Narasimhulu met CM KCR: మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) లోకి చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మూడు, నాలుగు రోజుల్లో మోత్కుపల్లి నర్సింహులు.. సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకుంటారని.. ఆ వెంటనే కీలక పదవి సైతం వరించనుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా.. సీఎం కేసీఆర్ ప్రకటించిన దళిత బంధు పథకం ప్రారంభం నాటి నుంచి మోత్కుపల్లి నర్సింహులు.. ప్రభుత్వ సమావేశాల్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. దళితబంధు పథకంపై చర్చ సందర్భంగా మంగళవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు.. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులును అసెంబ్లీకి తనవెంట తీసుకొనివచ్చారు. సాయంత్రం సభలో చర్చ ముగిసే వరకు మోత్కుపల్లి సీఎం కార్యాలయంలోనే ఉన్నారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ ప్రగతిభవన్కు తీసుకెళ్లారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. మూడు, నాలుగు రోజుల్లో మోత్కుపల్లి గులాబీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఆ వెంటనే కీలక పదవి లభించనుందని పేర్కొంటున్నారు. కాగా.. ప్రభుత్వం అమలు చేస్తున్న.. దళితబంధు పథకం.. రూపకల్పనతోపాటు కార్యాచరణలో సీఎం.. మోత్కుపల్లికి భాగస్వామ్యం కల్పించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన దళితబంధుకు సంబంధించిన సభలు, సమావేశాల్లో పాల్గొంటున్నారు.
కాగా.. సీఎం కేసీఆర్ చర్చ అనంతరం శాసనసభ కమిటీ హాలులో మంగళవారం భోజనం చేశారు. ముఖ్యమంత్రి అయ్యాక కమిటీ హాలులో ఆయన మధ్యాహ్న భోజనం చేయడం ఇదే ప్రథమమని అధికారులు పేర్కొన్నారు. శాసనసభ సమావేశాల సందర్భంగా సభ్యులకు అక్కడ భోజనాల ఏర్పాట్లు ఉంటాయి. సీఎం, మంత్రులు వారి కార్యాలయాల్లో భోజనం చేయడం ఆనవాయితీ. అయితే.. మధ్యాహ్న భోజన సమయంలో భద్రత సిబ్బందికి సమాచారం ఇవ్వకుండా సీఎం నేరుగా తన కార్యాలయం నుంచి కమిటీ హాలుకు వెళ్లి.. భోజనం తేవాలని చెప్పారు. దీంతో సిబ్బంది వెంటనే భోజన ఏర్పాట్లు చేశారు.
Also Read: