కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది రైతు వ్యతిరేక బడ్జెట్ అని, ఉపాధి హామి కూలీల వ్యతిరేక బడ్జెట్ అని తప్పుబట్టారు. దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేసేలా బడ్జెట్ ఉందని విమర్శించారు. ఉద్యోగులకు ఊరట ఇవ్వని బడ్జెట్.. కార్పొరేట్లకు వరంగా మారిందని విమర్శించారు. విద్య, వైద్య రంగాలను పట్టించుకోలేదని, తెలంగాణకు మొండిచేయి చూపించారని ఫైర్ అయ్యారు. “తొమ్మిదేళ్లుగా తెలంగాణ అడుగుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి మాటలేదు.. గిరిజన యూనివర్సిటీకి ఇచ్చిన నిధులు తూతూమంత్రమే. విభజన హామీలను ఏ ఒక్కటి అమలు చేయలేదు. జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వలేదు. రాష్ట్రంలోని నేతన్నలకు సంబంధించి జీఎస్టీ రాయితీలు కానీ, వారికి ప్రత్యేక ప్రోత్సాహాలు ఇవ్వడం కానీ చేయలేదు. కొత్త రాష్ట్రానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని అనేకసార్లు కోరాం.. కానీ, ఇప్పటి వరకు ఇచ్చిందేమీ లేదు.. ఈ బడ్జెట్లో కూడా ఇస్తామన్నది ఏమీ లేదని మంత్రి హరీశ్ విమర్శించారు.
బడ్జెట్లో రైతులకు సంబంధించిన నిధుల్లో భారీగా కోత పెట్టారు. ఎరువుల సబ్సిడీలు తగ్గించారు. గ్రామీణ ఉపాధి హామి నిధుల్లో కోత పెట్టారు. ఆహార సబ్సిడీలు తగ్గించారు. కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సులను అమలు చేస్తామని చెప్పలేదు. ఉద్యోగులకు, సింగరేణి కార్మికులకు ఇచ్చిన పన్ను మినహాయింపులు కూడా ఆశాజనకంగా ఏమీ లేదు. ఉద్యోగులను సైతం భ్రమల్లో పెట్టారు. ఇక సెస్సుల భారం తగ్గించలేదు. పన్నుల భారం నుంచి ఉపశమనం లేదు. ఇదో భ్రమల బడ్జెట్. పేదల వ్యతిరేక బడ్జెట్. తెలంగాణకు మొండి చేయి చూపిన బడ్జెట్.
– హరీశ్ రావు, తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి
మరోవైపు.. ఈ నెల 6 న ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్రావు, మండలిలో అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడతారు. 7న బడ్జెట్ అధ్యయనం చేయడానికి సెలవు ఇస్తారు. 8వ తేదీ నుంచి ఐదు రోజులపాటు అసెంబ్లీ నిర్వహించి అప్రాప్రియేషన్ బిల్లుకు ఆమోదంతో ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేయనున్నారు. ఈ సెషన్లో కాగ్ రిపోర్టును ప్రవేశపెట్టనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..