డయాలసిస్ బాధితులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా సేవలు అందిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఈ మేరకు హైదరాబాద్ వెంగళ రావు నగర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో 5 వేల మంది డయాలసిస్ పేషెంట్లకు ఆసరా పింఛన్ కార్డులను అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల మంది డయాలసిస్ పెషేంట్లకు వారి అకౌంట్లలో పింఛన్లు జమ చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఫించన్ జీవిత కాలం ఇస్తామని హామీ ఇచ్చారు. డయాలసిస్ బారిన పడిన పేషెంట్లు ధైర్యంగా ఎదుర్కొవాలని పిలుపునిచ్చారు. డయాలసిస్ గా నిర్ధారణ అయిన వారికి ఉచితంగా ముందులు అందజేస్తామని వెల్లడించారు. కిడ్నీ రోగుల కోసం బడ్జెట్లో రూ.100 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని, డయాలసిస్ రోగులకు సింగిల్ యూజ్ ఫిల్టర్ తీసుకువచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు మంత్రి హరీశ్రావు. ఇప్పటికే తెలంగాణలో 103 డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసుకున్నామని స్పష్టం చేశారు.
గాంధీ, ఉస్మానియా, నిమ్స్ లలో ఈ సేవలు అందుతున్నాయని మంత్రి హరీశ్ రావు చెప్పారు. రూ.40 కోట్లతో ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ ఉచితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతుంది. ప్రతి 100 మందిలో 20మందికి షుగర్, బీపీ వ్యాధులు వస్తున్నాయన్న మంత్రి.. చిన్న వయసులో సైతం కనిపిస్తున్నాయన్నారు. డాక్టర్ సూచనలు తీసుకోకుండా విపరీంతగా మందులు వాడేవారు డయాలసిస్ బారిన పడుతున్నట్లు చెప్పారు. డయాలసిస్ ను అరికట్టేందుకు స్వచ్ఛమైన తాగు నీటిని ప్రతి ఊరికి అందిస్తున్నామని మంత్రి హరీశ్ రావు వివరించారు.
ప్రభుత్వ హాస్పిటళ్ల నుంచి ఆరోగ్య శాఖ సేకరించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో కిడ్నీలు ఫెయిలైన కేసుల సంఖ్య తెలంగాణలో క్రమంగా పెరుగుతోంది. డయాలసిస్ అవసరమయ్యే కిడ్నీ వ్యాధులు రాష్ట్రాలకు భారంగా మారుతున్నాయి. ఇప్పటికే పెద్ద సంఖ్యలో డయాలసిస్ చేయించుకుంటున్నారు. డయబెటిస్, బీపీ, విచక్షణారహితంగా మందుల వాడకం కారణంగా ఈ సంఖ్య మరింత పెరగుతోంది. కిడ్నీ వ్యాధులకు సంబంధించి దేశంలో కచ్చితమైన రిజిస్ట్రీ లేదు. 17 శాతం జనాభా ప్రభావితులయ్యారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.