Traffic Rules: ట్రాఫిక్ రూల్స్ను ఉల్లంఘిస్తే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారనే విషయం తెలిసిందే. పోలీసుల నిఘా నేత్రం ఎప్పుడూ ఓ కన్నెసీ ఉంటుందనీ తెలుసు.. అయినా కొందరు మాత్రం ఇష్టారాజ్యంగా నిబంధనలను ఉల్లంఘిస్తుంటారు. తాజాగా హైదరాబాద్కు చెందిన ముగ్గురు యువకులు రోడ్డుపై బైక్తో విన్యాసాలు చేశారు. ఈ ఫొటోను సైబరాబాద్ పోలీసులు ట్విట్టర్లో పోస్ట్ చేసి ఫన్నీ క్యాప్షన్ రాసుకొచ్చారు.
వివరాల్లోకి వెళితే.. ముగ్గురు యువకులు పల్సర్ బైక్పై వెళుతున్నారు. ఈ సమయంలో మధ్యలో కూర్చున్న వ్యక్తి తన రెండు చేతులను డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి చుట్టు వేసి మొబైల్ ఫోన్ పట్టుకున్నాడు. డ్రైవింగ్ చేస్తూనే ఆ ఫోన్ను గమనిస్తున్నాడా డ్రైవింగ్ చేస్తోన్న వ్యక్తి. ఇలా రోడ్డుపై సర్కాస్ ఫీట్లు చేస్తూ వెళుతున్నారు. దీంతో అక్కడే ఉన్న ఓ ట్రాఫిక్ పోలీస్ సదరు యువకుల విన్యాసాన్ని క్లిక్ మనిపించి జరిమానా విధించారు. ఇక ఈ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు.. `రోడ్డుపై టైటానిక్ విన్యాసాలు.. పట్టుతప్పితే మునిగిపోతాయి ప్రాణాలు` అంటూ ప్రాసతో కూడిన క్యాప్షన్ జోడించారు. ఇక ఈ యువకులు చేసిన ఈ ఫీట్ విలువ రూ. 3600. ఈ ప్రబుద్ధులు ఒకేసారి ఆరు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించారు. అవేంటంటే.. బైక్ వెనకాల కూర్చున్న వ్యక్తి హెల్మెట్ ధరించని కారణంగా రూ. 100, సెల్ఫోన్ డ్రైవింగ్కు రూ. 1000, బహిరంగ ప్రదేశాల్లో మాస్కు సరిగ్గా ధరించనందుకు రూ. 1000, డ్రైవర్ హెల్మెట్ ధరించని కారణంగా రూ. 200, రెయిర్ వ్యూ చూడడానికి మిర్రర్లు లేని కారణంగా రూ. 100, ట్రిపుల్ రైడింగ్కు రూ. 1200 ఇలా మొత్తం జరిమానా విలువ రూ. 3600కు చేరింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
రోడ్డు పై టైటానిక్ విన్యాసాలు.
పట్టు తప్పితే మునిగిపోతాయి ప్రాణాలు.#RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/kzMzoclLCJ— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) June 10, 2021
Viral News: గేదెల గుంపుపై చిరుత దాడి.. ఆపై ఊహించని ట్విస్ట్.. అసలు ఏం జరిగిందంటే.?