Hyderabad: వారు అలా చేస్తే.. మూసీ ప్రాజెక్ట్ ఆపేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి 

|

Oct 17, 2024 | 7:17 PM

తాము చేపడుతున్నది మూసీ సుందరీకరణ కాదు.. మూసీ నది పునరుజ్జీవనమని చెప్పారు సీఎం రేవంత్. మూసీ దుర్గంధంలో మగ్గిపోతున్న వారికి మెరుగైన జీవితం ఇవ్వాలని ఈ ప్రాజెక్టు తలపెట్టామన్నారు. మెదడులో విషం నింపుకొని కొందరు మూసీ ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు.

Hyderabad: వారు అలా చేస్తే.. మూసీ ప్రాజెక్ట్ ఆపేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి 
CM Revanth Reddy
Follow us on

మూసీ ప్రాజెక్టుపై విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి. ప్రతీదీ రాజకీయం చేస్తే దశాబ్దాల దురవస్థ మారదన్నారు. మూసీ ప్రక్షాళనను వ్యతిరేకిస్తున్న విపక్షపార్టీలకు తెలంగాణ సీఎం సవాల్‌ విసిరారు. మూడునెలలు వారు మూసీ ఒడ్డున ఉండగలిగితే.. ప్రాజెక్ట్‌ ఆపేస్తామన్నారు రేవంత్‌రెడ్డి. మూసీ సుందరీకరణ కాదు.. పునరుజ్జీవ కార్యక్రమమన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. కాలుష్యం నుంచి విముక్తికోసం చేపట్టిన కార్యక్రమాన్ని ఆహ్వానించాల్సింది పోయి తప్పుడు ప్రచారం చేయడం దారుణమన్నారు.,

మూసీ నిర్వాసితుల స్థితిగతులు, వారి కుటుంబాలపై పూర్తిస్థాయి అధ్యయనం తర్వాతే పునరావాసం కల్పించామన్నారు రేవంత్‌రెడ్డి. అధికారులు దగ్గరుండి అన్నీ చూసుకున్నారన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో నిర్వాసితులకు ఎప్పుడైనా న్యాయం చేశారా అని ప్రశ్నించారు రేవంత్‌రెడ్డి.సెక్యూరిటీ లేకుండా ఎక్కడికి రావడానికైనా తాను సిద్ధమన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. బీఆర్‌ఎస్‌ అగ్రనేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనే రచ్చబండ పెట్టి ప్రజలతో అన్ని విషయాలూ చర్చిద్దామన్నారు.

బీఆర్‌ఎస్‌ హయాంలో తీసుకున్న నిర్ణయాలను తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు రేవంత్‌రెడ్డి. దామగుండంలో రాడార్‌ కేంద్రంపై వస్తున్న విమర్శలపై సీఎం స్పందించారు. దేశభద్రతకు సంబంధించిన విషయాలను కూడా రాజకీయం చేయడం దారుణమన్నారు. ఎవరు సమస్యలు చెప్పుకునేందుకు వచ్చినా వినడం విపక్షపార్టీల బాధ్యతన్నారు రేవంత్‌రెడ్డి. అలాంటి విన్నపాలను తమ దృష్టికి తెస్తే ప్రభుత్వపరంగా స్పందిస్తామన్నారు సీఎం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి