Telangana: పైనుంచి చూస్తే చింతపండు లోడే.. లోపల చెక్ చేస్తే స్టన్..
తగ్గేదే లేదు అంటున్నారు కేటుగాళ్లు. పుష్ప రేంజ్ మాస్టర్ స్కెచ్చులు వేస్తున్నారు. ఈజీగా డబ్బు సంపాదించాలనే ఆశతో.. తప్పుడు మార్గాలను ఎంచుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఓ గ్యాంగ్ హన్మకొండ పోలీసులకు చిక్కింది. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి....
ఏం హుషారు ఉన్నార్రా మీరు. క్రైమ్ చేయడానికి కూడా క్రియేటివిటీ. పోలీసులను బురిడీ కొట్టించేందుకు మాస్టర్ స్కెచ్. పుష్ప రేంజ్ ఐడియా. అయినా కానీ చిక్కారు. ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నారు. చింతపండు బస్తాల మాటున గంజాయి రవాణాకు యత్నించిన నలుగురు వ్యక్తులను హన్మకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈజీగా డబ్బు సంపాదించాలన్న ఆశతో వారు ఈ పనికి పూనుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు ఆంధ్రాలోని NTR జిల్లా.. పొన్నవరానికి చెందిన ఈదర కృష్ణ, అనుముల వెంకటరమణలుగా గుర్తించారు.
సీలేరుకు చెందిన సురేశ్ అనే వ్యక్తి వద్ద నిందితులు గంజాయి కొనుగోలు చేశారు. దీనిని హన్మకొండ జిల్లా శాయంపేటకు చెందిన అబ్దుల్ రహీం, మధ్యప్రదేశ్కు చెందిన మైనర్కు ఇచ్చేందుకు చింతపండు, యూరియా బస్తాల మాటున గంజాయిని పెట్టి బస్సులో హన్మకొండ తీసుకొచ్చారు. బస్టాండ్లో వీరు అనుమానాస్పదంగా సంచరించడంతో.. కొందరు గమనించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎస్సై శ్రవణ్కుమార్ సిబ్బందితో వెళ్లి.. వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. వారి వద్ద నుంచి రూ.2.35 లక్షల విలువైన 9.5 కేజీల గంజాయిని సీజ్ చేశారు. సీలేరుకు చెందిన సురేశ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
కాగా గంజాయి వినియోగం ఇప్పుడు విసృతంగా పెరగడం.. ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజూ పోలీసుల తనిఖీల్లో ఇబ్బడి ముబ్బడిగా గంజాయి దొరకుతోంది. ఒకసారి పోలీసులకు దొరికినవాళ్లు కూడా జైలుకు వెళ్లి వచ్చి.. ఇదే తంతుకు పూనుకుంటున్నారు. ఈ గంజాయి ముప్పు నుంచి యువతను రక్షించాలంటే.. పోలీసులు సెపరేట్ యాక్షన్ ప్లాన్ రూపొందించాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..