BRS: గెలిచిన ఇద్దరిలో ఒకరు జంప్.. అదే బాటలో మరో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ.. పాలమూరులో కారు ఖాళీ..?

| Edited By: Balaraju Goud

Jul 12, 2024 | 8:54 PM

ఉమ్మడి పాలమూరు జిల్లాలో గులాబీ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాభవం మూటగట్టుకున్న బీఆర్ఎస్.. అనంతర పరిణామాలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఉమ్మడి జిల్లాలో గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరు ఇప్పటికే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా, మిగిలిన ఒక్కరు కూడా త్వరలోనే పార్టీని వీడతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

BRS: గెలిచిన ఇద్దరిలో ఒకరు జంప్.. అదే బాటలో మరో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ.. పాలమూరులో కారు ఖాళీ..?
Mahabubnagar Brs
Follow us on

ఉమ్మడి పాలమూరు జిల్లాలో గులాబీ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాభవం మూటగట్టుకున్న బీఆర్ఎస్.. అనంతర పరిణామాలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఉమ్మడి జిల్లాలో గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరు ఇప్పటికే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా, మిగిలిన ఒక్కరు కూడా త్వరలోనే పార్టీని వీడతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అదే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీతో కలిసి అధికార పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారట..!

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బీఆర్ఎస్ గెలిచిందే ఇద్దరు ఎమ్మెల్యేలు. వారిలో ఇప్పటికే ఒకరు కాంగ్రెస్ లో చేరారు. మరో ఎమ్మెల్యేతో పాటు, ఎమ్మెల్సీ సైతం అదేబాటలో ప్రయాణానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో పూర్వపు మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ కు కోలుకోలేని షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో దారుణ ఓటమితో కుంగిపోయిన బీఆర్ఎస్ శ్రేణులకు వేగంగా మారుతున్న ఈ రాజకీయ పరిణామాలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.

సీఎం రేవంత్ రెడ్డి – ఎమ్మెల్సీ చల్లా భేటీ?

అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 14స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది కేవలం రెండే స్థానాలు అవి కూడా నడిగడ్డలోని అలంపూర్, గద్వాల్. ఇటీవలే రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కారు దిగి హస్తం పార్టీలో చేరిపోయారు. ఇక అదే బాటలో గద్వాల్ కు అనుకోని ఉన్న అలంపూర్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే విజేయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి సైతం కాంగ్రెస్ లో చేరతారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇటివల సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి భేటీ అవ్వడం ఈ ప్రచారానికి బలమైన ఆధారాలు లభించినట్లు అయ్యింది. అలంపూర్ నియోజకవర్గానికి చెందిన సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్సీ చల్లా సీఎం ను కలిశారని చెబుతున్నప్పటికీ, అసలు కారణం పార్టీలో చేరికపై ఇరువురు చర్చించారని టాక్ నడుస్తోంది. ఇక త్వరలోనే ముహూర్తం చూసుకొని కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని నియోజకవర్గంలో చర్చల మీద చర్చలు నడుస్తున్నాయి. ఎమ్మెల్సీ చల్లా తోపాటు ఆయన అనుచరుడు అలంపూర్ ఎమ్మెల్యే విజేయుడు సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని జోరుగా ప్రచారం నడుస్తోంది.

బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం ఉన్న ఏకైక ఎమ్మెల్యే విజేయుడు సైతం పార్టీ మారితే త్వరలోనే పాలమూరు జిల్లా నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున శాసనసభకు ప్రాతినిధ్యం ఉండకపోవచ్చు. అదే జరిగితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని షాక్ తగిలినట్టేనని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇప్పటికే వరుస ఎన్నికల్లో ఓటమితో కుంగిపోతున్న బీఆర్ఎస్ శ్రేణులకు ఈ పరిణామాలు మూలిగే నక్కపై మూడో తాటిపండు పడ్డట్టు ఉంటుదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతమెంతో ఘనం వర్తమానం మాత్రం శూన్యం అన్నట్లు ఉంది ప్రస్తుతం ఉమ్మడి పాలమూరు జిల్లాలో గులాబీ పార్టీ పరిస్థితి. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు జిల్లాలో బీఆర్ఎస్ ను ఖాళీ చేసేలా కనిపిస్తున్నాయి..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..