ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి పోరుబాట… రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ తికాయత్ గురించి మీకు తెలుసా…
రాకేశ్ తికాయత్... ఢిల్లీ శివార్లో రైతు ఉద్యమాన్ని ఉక్కు సంకల్పంతో ముందుడి నడుపుతున్న వ్యక్తి. ఉన్నత విద్యావంతుడు. పోలీసు
రాకేశ్ తికాయత్… ఢిల్లీ శివార్లో రైతు ఉద్యమాన్ని ఉక్కు సంకల్పంతో ముందుడి నడుపుతున్న వ్యక్తి. ఉన్నత విద్యావంతుడు. పోలీసు శాఖలో కానిస్టేబుల్గా ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడిన ఆయన.. ఆ ఉద్యోగాన్ని వదులుకొని రైతు ఉద్యమాలంటూ రోడ్ల మీద ధర్నాలు, నిరసనల వైపు ఎందుకు ఆకర్షితులయ్యారు? రైతు ప్రయోజనాలకు విఘాతం కలిగితే దానికి ఉద్యమమే మందు అని నమ్మి.. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉధృతంగా నడపడమే తప్ప ఉద్యమాన్ని విరమించని ఆయన పట్టుదలకు స్ఫూర్తి ఎవరు?
జననం…
రాకేశ్ తికాయత్ 1969 జూన్ 4న యూపీలోని ముజఫర్నగర్ జిల్లా సిసౌలీ గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి మహేంద్ర సింగ్ రైతు. 1987లో రైతు సమస్యలపై మహేంద్ర సింగ్ తికాయత్ ఆధ్వరంలో యూపీలోని షామ్లీ జిల్లా జిల్లా కర్ముఖేరిలో ఆందోళనలు జరిగాయి. ఇది పోలీసుల కాల్పులకు దారితీయడంతో ఇద్దరు రైతులు మృతిచెందారు. ఈ ఘటన అనంతరమే మహేంద్ర సింగ్ భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) అధ్యక్షుడయ్యారు. ఆయన కుమారుడైన రాకేశ్ తికాయత్ న్యాయవాద విద్యను అభ్యసించారు. 1985లో సునీతా దేవితో ఆయన వివాహమైంది. అదే సంవత్సరం ఆయన ఢిల్లీ పోలీసు శాఖలో కానిస్టేబుల్గా ఉద్యోగంలో చేరారు. 90 దశకంలో తన ఉద్యోగాన్ని వదిలేసి అప్పట్లో తండ్రి మహేంద్ర సింగ్ నేతృత్వంలో ఢిల్లీలోని ఎర్రకోట వద్ద సాగిన ఓ రైతు ఉద్యమంలో పాల్గొన్నారు. అప్పటి నుంచే రాకేశ్ తికాయత్, రైతుల ప్రయోజనాల కోసం పోరాడుతున్నారు.
తండ్రి మరణంతో…
కేన్సర్తో తండ్రి మహేంద్ర సింగ్ మృతిచెందిన తర్వాత భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధికార ప్రతినిధిగా రాకేశ్ నియమితులయ్యారు. అధ్యక్షుడిగా నరేశ్ తికాయత్ ఉన్నా కూడా యూనియన్పై పూర్తి పట్టు సాధించడం ద్వారా కీలక నిర్ణయాలన్నీ రాకేశ్ తికాయతే తీసుకుంటారు. ఇప్పటిదాకా రైతు ఉద్యమాల్లో పాల్గొని 44సార్లు జైలుకు వెళ్లారు. గణతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీలో రైతుల ఆందోళనలు హింసకు దారితీసిన ఘటనలో తికాయత్పై పలు కేసులు నమోదయ్యాయి. తనపై ఎన్ని కేసులు నమోదైనా వెరవని, చావనైనా చస్తాను గానీ రైతు ఉద్యమాన్ని విరమించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
రాజకీయం…
రాజకీయాల్లోనూ తికాయత్ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 2007లో ముజఫర్ జిల్లాలోని ఖటౌలీ అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా, 2014లో రాష్ట్రీయ లోక్దళ్ తరఫున అమ్రోహ జిల్లాలోని ఓ లోక్సభ స్థానం నుంచి పోటీ చేశారు. ఈ రెండు సందర్భాల్లోనూ గెలుపొందలేకపోయారు.