
ఆషాఢ మాస బోనాల పండుగకు గ్రేటర్ నగరం కళకళలాడుతోంది. గోల్కొండ కోటపై కొలువై ఉన్న జగదాంబిక ఎల్లమ్మ అమ్మవారికి కుమ్మరులు తొలిబోనంను సమర్పించారు. దీంతో బోనాల ఉత్సవాలు ప్రారంభం కాగా.. తెల్లవారు జాము నుంచే జగదాంబ అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. ఇవాళ్టి నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు గోల్కొండ బోనాల జాతర ఉత్సవాలు కొనసాగనున్నాయి.

మరోవైపు బోనాల ఉత్సవాల ఊరేగింపు ప్రారంభమైంది. డప్పువాయిద్యాలు, పోతరాజు విన్యాసాలు, శివసత్తుల పూనకాల మధ్య కోలాహలంగా ఊరేగింపు సాగింది. లంగర్ హౌజ్ నుండి గోల్కొండ కోట వరకు ఘటాల ఊరేగింపు జరిగింది. కళాకారులు పూనకాలతో ఊగిపోయారు.

కాగా గోల్కొండ బోనాలకు పలువురు రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్, మేయర్ గద్వాల విజయలక్ష్మి హాజరయ్యారు. అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. పోతురాజుల ఊరేగింపులు, విన్యాసాలు తిలకించారు.

బోనాల పండుగ జరిగే అన్ని రోజులు భక్తులకు ప్రభుత్వం కోటలోకి ఉచిత ప్రవేశం కల్పించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లు చేశారు. జీహెచ్ఎంసీ, పోలీస్, హెల్త్, ట్రాఫిక్, ఎలక్ట్రిసిటీ అధికారులు విధుల్లో ఉన్నారు.

ఇదిలా ఉంటే వేడుకలు వీక్షించేందుకు వచ్చే భక్తులకు తాగు నీటి ఇబ్బందులు లేకుండా జలమండలి భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. అలాగే ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేకంగా హెల్త్ క్యాంప్లు ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో అవసరమైయ్యే అంబులెన్స్ను సిద్ధం చేశారు. అగ్ని మాపక సిబ్బంది కూడా అన్ని ఏర్పాట్లు చేశారు.