భోపాల్, జూన్ 9: క్రేన్ లిఫ్ట్లో ఎక్కి ఇద్దరు నేతలు విగ్రహానికి పూల దండ వేయబోయారు. కానీ అంతలోనే క్రేన్ ఒక్కసారిగా విరిగి, కుప్పకూలిపోయింది. దీంతో 20 అడుగుల ఎత్తు నుంచి కిందపడి ఇద్దరు నేతలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్లోని భోపాల్లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. అసలేం జరిగిందంటే..
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో పలు చోట్ల నేడు మహారాణా ప్రతాప్ జయంతి ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో భోపాల్లోని 66 వార్డు కౌన్సిలర్ జితేండ్ర సింగ్ రాజ్పుత్ తన మామతో కలిసి మహారాణా ప్రతాప్ విగ్రహానికి పూలదండ వేసేందుకు వెళ్లారు. అక్కడ క్రేన్ ఏర్పాటు చేశారు. మామతో పాటు జితేంద్ర సింగ్ క్రేన్ ఎక్కి.. అందులో విగ్రహం ఎత్తు అంటే 20 అడుగుల ఎత్తు వరకు వెళ్లారు. లిఫ్ట్ విగ్రహం వద్దకు చేరగానే.. జితేంద్ర పూల మాల వేసేందుకు ముందుకు వంగగా ఒక్కసారిగా క్రేన్ విరిగిపోయింది. లిఫ్టుపై వెల్డింగ్ విరిగిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.
भोपाल में महाराणा प्रताप की प्रतिमा पर माल्यार्पण के दौरान लिफ्ट टूटी, पार्षद घायल pic.twitter.com/yG01cbm3jP
— NaiDunia (@Nai_Dunia) June 9, 2024
దీంతో అందులో ఉన్న జితేంద్ర సింగ్, అతడి మామ అంత ఎత్తునుంచి ఒక్కసారిగా కిందపడి పోయారు. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో జితేంద్ర సింగ్ కాలు విరిగింది. గాయపడిని వారిద్దరిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.