శివసేన స్పీడ్ మీదుంది. ఇప్పటికే మహారాష్ట్రలో అధికారాన్ని కైవసం చేసుకున్న సేన.. ఇతర రాష్ట్రాల్లోనూ పోటీకి ఉవ్విళ్లూరుతోంది. రాబోయే ఎన్నికల్లో రంగంలోకి దిగేందుకు అస్త్రశస్త్రాలు రెడీ చేసుకుంటోంది. అటు ఉత్తరప్రదేశ్, ఇటు గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతోంది శివసేన. ఈ విషయాన్ని ఆ పార్టీ నేత, ఎంపీ సంజయ్ రౌత్ స్వయంగా వెల్లడించారు. యూపీలో మొత్తం 403 మంది నియోజకవర్గాలుండగా.. సేన 80-100 సీట్లలో అభ్యర్థులను నిలబెడుతుందని స్పష్టం చేశారు. 40 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలున్న గోవాలో 20 చోట్ల పోటీకి దిగనున్నట్టు వెల్లడించారు. వెస్ట్ యూపీలోని రైతు సంస్థలు శివసేనకు మద్దతు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేశాయంటున్నారు సంజయ్ రౌత్. చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుంటామన్నారు. గోవాలోనూ ‘మహావికాస్ అఘాడి’ ఫార్ములా కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ శివసేనకు క్యాడర్ ఉందని, విజయం.. ఓటమితో సంబంధం లేకుండా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. 2019లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీఎం పదవి పంచుకునే విషయంలో శివసేన మిత్రపక్షం బీజేపీతో తెగతెంపులు చేసుకుంది. ఆ తర్వాత ఎన్సీపీ, కాంగ్రెస్తో కలిసి కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఇక.. ఇప్పుడు యూపీ, గోవా ఎన్నికల్లోనూ శివసేన పోటీకి దిగుతుండడం ఆసక్తి రేపుతోంది. బీజేపీ ఓటుబ్యాంకుకు గండికొట్టడమే లక్ష్యంగా శివసేన పోటీ చేస్తోందన్న చర్చ సాగుతోంది. ఆయా రాష్ట్రాల్లో మిత్రపక్షాలకు లాభం చేకూర్చేందుకే శివసేన కొత్త ఎత్తుగడ వేస్తోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గెలుపోటముల సంగతి పక్కనబెడితే శివసేన పోటీతో ఆయా రాష్ట్రాల్లో ఓట్లు చీలిపోవడం మాత్రం పక్కా అన్నది స్పష్టమవుతోంది.
Also Read: రూ.40 వేలకే కేటీఎం, రూ.35 వేలకే రాయల్ ఎన్ఫీల్డ్.. ఏంటా అని ఆరా తీయగా పోలీసులు షాక్