Karnataka Congress: కర్ణాటకలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్ధి ఎవరనే విషయంపై.. ఆపార్టీ నేతల నుంచి భిన్నమైన ప్రకటనలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర చీఫ్, ట్రబుల్ షూటర్.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవిపై తాను దృష్టిసారించలేదని.. రాష్ట్రంలో బీజేపీని ఓడించి కాంగ్రెస్ను తిరిగి అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. సీఎం పదవిపై తాను తొందరపడటం లేదని, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే తన అజెండాగా ఉందని డీకే శివకుమార్ పేర్కొన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం సిద్ధరామయ్యను పార్టీ సీఎం అభ్యర్ధిగా ప్రకటించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ప్రతిపాదనకు మరో ఎమ్మెల్యే రాఘవేంద్ర హిత్నల్ మద్దతు పలికారు.
అయితే.. ఎమ్మెల్యేల ప్రకటనపై స్పందిస్తూ డీకే ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై పోరాడి ఆ పార్టీని మట్టికరిపించి కాంగ్రెస్ను అధికారంలోకి తేవడమే పార్టీ నేతలు, కార్యకర్తల ముందున్న ప్రస్తుత కర్తవ్యమని పార్టీ శ్రేణులకు డీకే శివకుమార్ హితవు పలికారు. వేరే విషయాలపై దృష్టిని పక్కదారి పట్టించకుండా బీజేపీకి వ్యతిరేకంగా అంతా పోరాటం సాగించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని డీకే సూచించారు. కాగా.. కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం, పార్టీ రాష్ట్ర శాఖ మాజీ చీఫ్ జీ పరమేశ్వర్ డీకే శివకుమార్కు మద్దతును ప్రకటించడం చర్చనీయాంశమైంది.
Also Read: