Lion Severely Injured: గుజరాత్ అమ్రేలీ జిల్లాలోని రాజులా అటవీ ప్రాంతంలో గూడ్స్ రైలు సింహాన్ని ఢీకొట్టింది. మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో సింహం తీవ్రంగా గాయపడింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకొనిని గాయపడ్డ సింహాన్ని బాబర్కోట్ రెస్క్యూ సెంటర్కు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం తదుపరి ట్రీట్మెంట్ కోసం జునాగఢ్లోని సక్కర్బాగ్ జంతు ప్రదర్శనశాలకు తరలించారు. ఈ ప్రమాదంలో మగ సింహం తీవ్రంగా గాయపడిందని.. ప్రస్తుతం దానికి చికిత్స అందిస్తున్నట్లు డీఎఫ్ఓ నిషారాజ్ వెల్లడించారు. 5 నుంచి 9 ఏళ్ల మధ్యనున్న ఈ సింహం రాజులా అటవీ ప్రాంతానికి పిపవావ్ ఓడరేవుకు మధ్య సంచరిస్తుండగా ప్రమాదానికి గురైందని.. ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేనట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు నిషారాజ్ వెల్లడించారు. అమ్రేలీ ప్రాంతంలో సింహాలు ఎక్కువగా సంచరిస్తుంటాయి. కొన్ని సంవత్సరాల నుంచి చాలా సింహాలు ఇలాంటి సంఘటనల్లో మరణించాయి.
Also Read: