India – China: ముల్లును ముల్లుతోనే తీయాలి.. చైనాకు భారత్‌ స్ట్రాంగ్ కౌంటర్‌.. LACని కాపాడేందుకు..

|

Mar 28, 2025 | 9:56 AM

ముల్లును ముల్లుతోనే తీయాలని ఇండియన్‌ ఆర్మీ నిర్ణయించింది. లద్దాఖ్‌లో చైనా కౌంటీల నిర్మాణానికి కౌటర్‌గా భారత్‌ కూడా దూకుడును ప్రదర్శిస్తోంది. తూర్పు లద్దాఖ్‌లో అదనంగా కొత్త ఆర్మీ డివిజన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. 72 ఆర్మీ డివిజన్‌ ఫోకస్ అంతా ఇకపై తూర్పు లద్దాఖ్‌ పైనే ఉంటుంది. మరోవైపు అరుణాచల్‌ సరిహద్దులో కూడా భారత్‌ యుద్ద విన్యాసాలు చేసింది.

India - China: ముల్లును ముల్లుతోనే తీయాలి.. చైనాకు భారత్‌ స్ట్రాంగ్ కౌంటర్‌.. LACని కాపాడేందుకు..
Indian Army
Follow us on

తూర్పు లద్దాఖ్‌ దగ్గర చైనా ఏర్పాటు చేస్తున్న కౌంటీలకు భారత్‌ అదేరీతిలో కౌంటర్‌ ఇస్తోంది. తూర్పు లద్దాఖ్‌లో అధునాతన బలగాలను మొహరించాలని నిర్ణయించారు. 72 ఇన్‌ఫాంట్రీ డివిజన్‌ను తూర్పు లద్దాఖ్‌కు తరలించబోతున్నారు. 2017 నుంచి ఈ ప్రతిపాదన ఉన్నప్పటికి ఈసారి అమలు చేయాలని నిర్ణయించారు. ఆర్మీ లోని 72 డివిజన్‌కు కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారు.

తూర్పు లద్దాఖ్‌కు చైనా కవ్వింపులకు చెక్‌ పెట్టడానికి 30 వేల బలగాలను అదనంగా తరలించబోతున్నారు. 2020లో చైనాతో గాల్వాన్‌ గొడవ తరువాత భారత్‌ అలర్ట్‌గా ఉంది. ఓవైపు సరిహద్దు వివాదంపై చర్చలు జరుపుతూనే తూర్పు లద్దాఖ్‌లో మౌలిక వసతుల కల్పనపై ఎక్కువగా దృష్టి సారించారు. వాస్తవానికి ఆర్మీ 72 డివిజన్‌ను పాకిస్తాన్‌ను టార్గెట్‌ చేసేందుకు తయారు చేశారు. కాని పాక్‌ కంటే చైనా నుంచే ముప్పు ఎక్కువగా ఉండడంతో ఇప్పుడు ఫోకస్‌ అంతా అటువైపు పెట్టారు.

అంతేకాకుండా, జమ్ము నుంచి అదనపు బలగాలను కూడా తూర్పు లద్దాఖ్‌కు తరలిస్తున్నారు. అయితే ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉండడంతో జమ్ముకు కూడా అవసరమైన మేర బలగాలను అందుబాటులో ఉంచుతారు. ఆర్మీ 72 డివిజన్‌ ఇకపై పూర్తిగా తూర్పు లద్దాఖ్‌ పైనే ఫోకస్‌ పెడుతుంది.

LACని కాపాడేందుకు ఆర్మీ 72 డివిజన్‌ కృషి

వాస్తవాధీన రేఖ LACని కాపాడేందుకు ఆర్మీ 72 డివిజన్‌ అహర్నిశలు పాటు పాడుతుంది. దీని హెడ్‌క్వార్ట్స్‌ లేహ్‌ లోనే ఏర్పాటు చేస్తారు.. గతంలో పంజాబ్‌ లోని పఠాన్‌కోట్‌లో కార్యకలాపాలు కొనసాగించే డివిజన్‌ను ఇక్కడికి తరలిస్తున్నారు. తూర్పు లద్దాఖ్‌ లోని 832 కిలోమీటర్ల మేర సరిహద్దును ఆర్మీ 72 డివిజన్‌ కంటికి రెప్పలా కాపాడుతుంది.

చైనాతో తో సరిహద్దు వివాదం పరిష్కారానికి ఓవైపు చర్చలు సాగుతుండగానే భారత్‌ చాలా అప్రమత్తంగా ఉంటోంది. అందుకే ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేసి బలగాల తరలింపుపై నిర్ణయం తీసుకుంటున్నారు. మరోవైపు అరుణాచల్‌ సరిహద్దులో కూడా భారత్‌ యుద్ద విన్యాసాలు చేసింది. కోల్‌కతాకు చెందిన ఈస్ట్రన్ కమాండ్‌ త్రివిధ దళాల బహుముఖ యుద్ధవిన్యాసాలు చేపట్టింది. ప్రచండ్‌ ప్రహాల్‌ పేరుతో మూడు రోజుల పాటు వీటిని నిర్వహించారు. అరుణాచల్‌ సరిహద్దుల్లో కూడా చైనా తరచుగా కవ్వింపులకు పాల్పడుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..