దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్ పరీక్షను రద్దు చేయడం సరికాదంటూ తేల్చి చెప్పింది. పరీక్ష రద్దు చేస్తే సిన్సియర్ స్టూడెంట్స్ నష్టపోతారంటూ అఫిడవిట్లో స్పష్టం చేసింది. పారదర్శకంగానే పోటీ పరీక్షల నిర్వహణకు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది కేంద్రం. నీట్ పేపర్ లీక్ కేసులో ఇప్పటికే పలువురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. నీట్ అక్రమాలపై సీబీఐతో సమగ్ర దర్యాప్తునకు ఆదేశించామన్న కేంద్రం.. భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు ఆధారాల్లేవని తెలిపింది. అలాంటప్పుడు ఫలితాలు విడుదలైన పరీక్షను రద్దు చేయడం కరెక్ట్ కాదని అఫిడవిట్లో పేర్కొంది కేంద్రం. నీట్ను రద్దు చేస్తే నిజాయతీగా పరీక్ష రాసిన లక్షల మంది నష్టపోతారని తెలిపింది.
ఇక మే 5న నిర్వహించిన నీట్ పరీక్ష లీకేజీ అంటూ దేశవ్యాప్తంగా దుమారం రేగింది. ఫలితాల్లో 60 మందికిపైగా ఫస్ట్ ర్యాంక్ రావడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. విద్యార్థులతో సహా పలుపార్టీ నేతలు సైతం పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. మరోవైపు నీట్ వివాదంపై ఇప్పటికే సుప్రీం కోర్టులో 26 పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం జులై 8న ఈ పిటిషన్లపై విచారణ జరపనుంది. మరోవైపు ఎగ్జామ్ను రద్దు చేయొద్దంటూ 56 మంది నీట్ ర్యాంకర్లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పైనా జులై 8నే విచారణ జరపనుంది సుప్రీంకోర్టు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.