Covid Positivity Rate: కోవిడ్ పాజిటివిటీ రేటు 10శాతం మించిన జిల్లాల్లో ఇకపై నిబంధనలు కఠినంగా అమలు కానున్నాయి. ప్రజలు సమూహాలుగా ఏర్పడకుండా కొవిడ్ నిబంధనలను పక్కాగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం గట్టిగా చెప్పింది. కరోనా వైరస్ తీవ్రత పెరుగుతోన్న కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, అస్సాం, మిజోరాం, మేఘాలయా, ఆంధ్రప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాల అధికారులతో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దాదాపు దేశవ్యాప్తంగా దాదాపు 46 జిల్లాల్లో కొవిడ్ పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా ఎక్కువగా నమోదవుతున్న విషయాన్ని గుర్తుచేశారు. 53 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 నుంచి 10శాతం మధ్యలో ఉందని వెల్లడించారు. ఈ జిల్లాల్లో నిర్లక్ష్యం వహిస్తే పరిస్థితులు మరింత క్షీణించే ప్రమాదముందని హెచ్చరించారు.
వైరస్ తీవ్రత పెరుగుతోన్న రాష్ట్రాల్లో కొవిడ్ కట్టడి చర్యలు, టెస్టులు ముమ్మరం చేస్తూనే వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని కేంద్రం సూచించింది. 60ఏళ్ల వయసుపైబడిన వారితో పాటు 45-60ఏళ్ల వారికి కొవిడ్ మరణం ముప్పు ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తోన్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ వేగం పెంచాలని రాష్ట్రాలకు సూచించింది. ఈ నేపథ్యంలో రెండో డోసు వారికి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకునే విధంగా ప్రైవేటు ఆస్పత్రులను ప్రోత్సహించాలని తెలిపింది.
దేశంలో కొన్ని చోట్ల వైరస్ ఉద్ధృతి తగ్గినట్లు కనిపించినప్పటికీ మరో ముప్పు మాత్రం ముంచుకొస్తూనే ఉంది. నిత్యం నమోదవుతున్న మొత్తం కేసుల్లో సగం కేసులు కేవలం రెండు, మూడు రాష్ట్రాల్లోనే ఉంటున్నాయి. ఇదే సమయంలో దాదాపు పది రాష్ట్రాల్లో మళ్లీ వైరస్ ఉద్ధృతి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే సమయంలో దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి ఇంకా కొనసాగుతూనే ఉందని.. రాబోయే రోజుల్లో మూడో ముప్పు తప్పదని కేంద్ర ప్రభుత్వం పదేపదే హెచ్చరిస్తోంది.