ధరణి పోర్టల్ వివరాల నమోదులో ప్రవాసీల కష్టాలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వ్యవసాయేతర ఆస్తుల వివరాల నమోదు కార్యక్రమం చురుకుగా సాగుతోంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వ్యవసాయేతర ఆస్తుల వివరాల నమోదు కార్యక్రమం చురుకుగా సాగుతోంది. అయితే, ప్రవాసులకు చెందిన వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రస్తుతానికి సాధ్యపడడం లేదు. వారికి ఆధార్ కార్డులు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమంటున్నారు అధికారులు. నగరానికి చెందిన వేలాది మంది అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్ తదితర దేశాల్లో స్థిరపడ్డారు. అయినా మన దేశంలో ఆస్తులను కొనుగోలు చేశారు. అక్కడే గ్రీన్ కార్డు పొందడంతో… స్వస్థలాల్లో కనీసం ఆధార్ కార్డు కూడా తీసుకోలేదు. పౌరుల ఆస్తుల నమోదు ప్రారంభించిన ప్రభుత్వం… వారి ఆస్తులను ఆధార్ నంబర్ ఆధారంగా నమోదు చేస్తోంది. అయితే, ప్రవాసులకు ఆధార్ కార్డులు లేకపోవడంతో ప్రస్తుతం ఆ ఆస్తులు ఆన్లైన్లో నమోదు కావడం లేదు. దీంతో కొంత ఆందోళనకు గురవుతున్నారు ప్రవాస భారతీయులు.
అయితే, ప్రస్తుతానికి అవకాశం లేదని, ఎన్నారైల ఆస్తుల నమోదుపై ప్రభుత్వం త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటుందని ఓ అధికారి చెబుతున్నారు. పీటీఐ నంబర్ లేని వారికి ఆధార్ కార్డు నంబర్, విద్యుత్తు, నల్లా కనెక్షన్ నంబర్లతోపాటు కుటుంబ సభ్యుల వివరాలు సేకరిస్తున్న తరహాలో ప్రవాసుల ఆస్తుల నమోదు ఉండవచ్చని తెలిపారు. ఇదిలా ఉంటే, ఆస్తుల నమోదుకు అవకాశం కల్పిస్తూ పౌరులకు పంపుతున్న మీ సేవా పోర్టల్ లింక్ ఓపెన్ కావడం లేదు. రెండు రోజులుగా స్వీయ ఆస్తుల నమోదుకు యత్నించిన పౌరులు ఇబ్బందులు పడ్డారు. వివరాల సేకరణలో మార్పులకనుగుణంగా అప్డేట్ జరుగుతుందని, అందుకే పోర్టల్ తాత్కాలికంగా నిలిచిపోయి ఉంటుందని జీహెచ్ఎంసీ అధికారి ఒకరు తెలిపారు.
మరోవైపు ధరణి దరఖాస్తుల రూపం మారింది. తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ లోగోలతో ఇంటింటికీ ఇచ్చిన పత్రాలను సోమవారం హఠాత్తుగా మార్చేశారు. లోగోలు లేని దరఖాస్తులను సిబ్బందికి అందజేశారు. పీటీఐఎన్తోపాటు విద్యుత్ మీటర్, నల్లా కనెక్షన్కు సంబంధించి సీఏఎన్, స్థల విస్తీర్ణం, ఇంటి విస్తీర్ణం తదితర వివరాలు తీసుకుంటున్నారు. పాస్పోర్ట్ సైజ్ ఫొటో తప్పనిసరి కాదని అధికారులు చెబుతున్నారు.