Corona in AP: మాతృదినోత్సవం రోజున దారుణం.. కరోనాతో నిండు గర్భిణీ కన్నుమూత
తూర్పుగోదావరి జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. చాప కింద నీరులా వైరస్ వ్యాప్తి చెంది ప్రజల ప్రాణాలు నిర్దాక్షిణ్యంగా బలి తీసుకుంటోంది.
తూర్పుగోదావరి జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. చాప కింద నీరులా వైరస్ వ్యాప్తి చెంది ప్రజల ప్రాణాలు నిర్దాక్షిణ్యంగా బలి తీసుకుంటోంది. కాకినాడ జనరల్ హాస్పిటల్లో మాతృదినోత్సవం రోజునే దారుణం చోటు చేసుకుంది. కరోనా మహమ్మారి నిండు గర్భిణీ ప్రాణాలను బలిగొంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లితో పాటు కడుపులో బిడ్డ కూడా కన్నుమూసింది. వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ రమణయ్య పేట సచివాలయం 2 లో వాలంటీర్ గా విధులు నిర్వహిస్తున్న ఎరుసు లక్ష్మీ నిండు గర్భిణీ. ఇటీవల లక్ష్మీకి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో ఈ నెల 1 వతేదిన కుటుంబీకులు ఆమెను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మే 9న లక్ష్మీ ప్రాణాలు విడిచింది. పడంటి బిడ్డకు జన్మనిస్తుందనుకున్న ఆ తల్లి…బిడ్డ పుట్టకుండానే తల్లీబిడ్డలిద్దరూ మృత్యువాతపడ్డారు. అయితే, చివరి నిమిషంలో మృతురాలు తన బాధను వెళ్లగక్కుతూ సెల్ఫీ వీడియోను రికార్డ్ చేసింది. ఇది ఆస్పత్రిలో కోవిడ్ బాధితుల దుస్థితికి అద్దం పడుతోంది.
అయితే, తన భార్యను హాస్పటిల్లో చేర్పించినప్పటి నుండి కూడా వైద్యులు పాటించుకోలేదంటూ మృతురాలి భర్త ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో 9 రోజులు నరకయాతన అనుభవించి వైద్యం అందకనే వాలంటీర్ లక్ష్మీ మరణించిందని ఆరోపించారు.
Also Read: కోవిడ్ కేర్ సెంటర్గా.. కల్వరి టెంపుల్.. 300 పడకలతో ఏర్పాటు