ఏమైనా నేరాలు జరిగితే..వెంటనే అక్కడకు చేరుకుని వేగంగా శాస్త్రీయమైన ఆధారాలు సేకరించి, కేసుల దర్యాప్తులో వేగాన్ని పెంచేందుకు, నేరస్థులను పట్టుకునేందుకు క్లూస్ టీమ్ల సహాయ సహకారాలు ఎంతో అవసరమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పేర్కొన్నారు. శుక్రవారం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డివిజన్ల వారీగా 9 క్లూస్ టీమ్స్ విభాగాలను, కమిషనరేట్ పరిధిలో మూడు ఫింగర్ ప్రింట్స్ యూనిట్లను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. గతంలో కమిషనరేట్ పరిధిలో బాలానగర్, మాదాపూర్, శంషాబాద్ మూడు జోన్లకు మూడు క్లూస్ టీమ్స్ మాత్రమే ఉండేవని… ఇప్పుడు డివిజన్ స్థాయిలో మియాపూర్, కూకట్పల్లి, మాదాపూర్, పేట్ బషీరాబాద్, బాలానగర్, శంషాబాద్, చేవెళ్ల, రాజేంద్రనగర్, షాద్నగర్ డివిజన్లకు స్పెషల్గా క్లూస్ టీమ్స్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సైబరాబాద్ మొత్తానికి ఇదివరకు ఒక్కటే ఫింగర్ ప్రింట్ యూనిట్ ఉండేదని.. ఇప్పుడు మూడు ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో క్లూస్ టీమ్లో నలుగురు ఫోరెన్సిక్ విభాగ నిపుణులు, ఇద్దరు ఫొటో గ్రాఫర్ కమ్ వీడియో గ్రాఫర్స్, ఇద్దరు డ్రైవర్లు 24/7, 12 గంటల షిఫ్ట్ల్లో సేవలందిస్తారని చెప్పారు. ఫింగర్ ప్రింట్ యూనిట్లో ఒక ఫింగర్ పింట్ నిష్ణాతుడు, ట్రైనింగ్ ఇచ్చిన నలుగురు కానిస్టేబుళ్లు, ఇద్దరు డ్రైవర్లు ఉంటారని వెల్లడించారు. క్లూస్ టీమ్స్ అన్ని డివిజన్ల స్థాయిలోని ఏసీపీలు, ఫింగర్ ప్రింట్ యూనిట్లు జోనల్ స్థాయిలోని డీసీపీల నేతృత్వంలో వర్క్ చేస్తాయని వివరించారు.
Also Read :
భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్..సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాలు పెంపు