CM Chandrababu: ఆ విషయంలో రాజీపడబోం.. టీటీడీలో ప్రక్షాళన ప్రారంభించాం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

|

Oct 05, 2024 | 4:11 PM

శ్రీవారి ప్రసాదం నాణ్యత విషయంలో రాజీపడబోమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గతంలో ప్రసాదం బాగోలేదని చాలాసార్లు భక్తులు ఆందోళన చేస్తే నాటి పాలకులు పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం పూర్తి ప్రక్షాళన చేపట్టామని.. భక్తుల అభిప్రాయాన్ని తీసుకుంటామన్నారు.

CM Chandrababu: ఆ విషయంలో రాజీపడబోం.. టీటీడీలో ప్రక్షాళన ప్రారంభించాం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Cm Chandrababu
Follow us on

శ్రీవారి ప్రసాదం నాణ్యత విషయంలో రాజీపడబోమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గతంలో ప్రసాదం బాగోలేదని చాలాసార్లు భక్తులు ఆందోళన చేస్తే నాటి పాలకులు పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం పూర్తి ప్రక్షాళన చేపట్టామని.. భక్తుల అభిప్రాయాన్ని తీసుకుంటామన్నారు. తిరుమలలో రూ.13.40 కోట్లతో నిర్మించిన వకుళామాత వంటశాలను శనివారం సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వకుళా మాత కేంద్రీయ వంటశాలను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. 1.25 లక్షల మందికి అన్నప్రసాదాన్ని ఈ వంటశాల ద్వారా అందించవచ్చన్నారు. 18 వేల మందికి అరగంటలో ఒక రకం వంటకాన్ని ఈ కిచెన్ ద్వారా అందించవచ్చని తెలిపారు. వెంగమాంబ, అక్షయ, వకుళమాత వంటశాలలతో 3 లక్షల మందికి అన్నప్రసాదం అందించవచ్చని వివరించారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలందించేలా ఆధునిక కిచెన్ లు ఏర్పాటు చేశామని.. శ్రీవారి ప్రసాదాల నాణ్యతలో రాజీపడబోమని తెలిపారు. ముడిసరుకుల నుండి ప్రసాదం బయటకు వచ్చేవరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. వెంకటేశ్వరస్వామి లడ్డు ప్రపంచంలో ఎవరూ ఎక్కడా తయారు చేయలేకపోయారని.. దీనికి పేటెంట్ కూడా ఉందన్నారు. పవిత్రమైన శ్రీవారి లడ్డు, జిలేబీ, మైసూర్ పాక్, వడకు ప్రత్యేకత ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

భక్తుల అభిప్రాయాలకు అనుగుణంగా సేవలు

టీటీడీలో ప్రక్షాళన ప్రారంభించామని.. రాబోయే రోజుల్లో భక్తుల నుండి అభిప్రాయం తీసుకుంటామని సీఎం చంద్రబాబు తెలిపారు. గ్రీనరీ ప్రస్తుతం 72 శాతం ఉందని.. దీన్ని 90 శాతానికి తీసుకెళ్లే అవకాశం ఉందన్నారు. బయో డైవర్సిటీకి చర్యలు తీసుకోవడంతో పాటు ప్రశాంత వాతావరణాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. భక్తులకు దివ్య క్షేత్రంగా తిరుమల ఎప్పుడూ ఉంటుందన్నారు. భక్తల మనోభావాలకు, సాంప్రదాయాలకు అనుగుణంగా తిరుమలలో ప్రసాదం ఉంటుందని.. శ్రీవారి సేవకులకు కూడా కెపాసిటీ బిల్డింగ్ చేస్తామని తెలిపారు. తిరుమలలో మళ్లీ పూర్వవైభవం తీసుకొస్తామని.. దివ్యక్షేత్రం పవిత్రతకు భంగం కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి టీటీడీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.

లడ్డు ప్రసాదంతో పాటు, అన్నప్రసాదం, ఇతర ప్రసాదాల్లో రాబోయే రోజుల్లో పరీక్షలు ఉంటాయని సీఎం చంద్రబాబు తెలిపారు. తాను నిద్ర లేచిన సమయంలోనైనా, తనకు కష్టం వచ్చిన ప్రతిసారి వెంకటేశ్వరున్ని తలచుకుంటానని సీఎం చంద్రబాబు తెలిపారు. తిరుమల కొండపై పని చేసేవారు, కొండకు వచ్చేవారు పవిత్రంగా ఉండాలని.. ప్రపంచంలో ఉండే హిందువుల మనోభావాలకు ఈ తిరుమల కేంద్ర బిందువని.. ఆ ఎకో సిస్టం కాపాడతామని తెలిపారు. ఎన్టీఆర్ హయాంలో అన్నదానం ప్రారంభమైందని.. ఏ ప్రాంతంలో లేని విధంగా ఒక దేవుడి సన్నిధిలో అన్నదానం జరుగుతోందని తెలిపారు. నాడు రెండు,మూడు వేల మందితో ప్రారంభమై నేడు 3 లక్షల మందికి అన్నదానం జరుగుతోందని చంద్రబాబు వివరించారు. అన్నదానం, ప్రాణదానం కార్యక్రమాలను మరింత స్ట్రీమ్ లైన్ చేస్తామని.. క్యూ మేనేజ్ మెంట్ కూడా సరిగా చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. పరిశుభ్రత, ప్రసాదం నాణ్యత, మేనేజ్ మెంట్ లో కూడా మార్పు వచ్చిందని.. దీంతో భక్తులు హర్షిస్తున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.