పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ దూకుడు.. ఓటర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక మొబైల్ యాప్ విడుదల
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ పార్టీ దూకుడు పెంచింది. దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించి ఊపుమీదున్న రాష్ట్ర నాయకత్వం.. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ పార్టీ దూకుడు పెంచింది. దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించి ఊపుమీదున్న రాష్ట్ర నాయకత్వం.. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై కసరత్తును పూర్తి చేసింది. రెండు స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండగా ఇద్దరు అభ్యర్థులను ఖరారు చేసింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్రావు, వరంగల్-నల్లగొండ-ఖమ్మం సెగ్మెంటు నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్రెడ్డిల పేర్లను రాష్ట్ర నాయకత్వం ఖరారు చేసినట్లు సమాచారం. వీరి పేర్లను జాతీయ నాయకత్వానికి రాష్ట్ర పార్టీ నివేదించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలావుంటే, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు నమోదు ప్రక్రియలో బీజేపీ కీలకపాత్ర పోషించింది. ఏ పార్టీ ఎక్కువ ఓటర్లను చేర్చుకుంటుందో.. ఎక్కువగా ఓటర్ల నమోదులో భాగస్వామ్యం అవుతుందో.. ఆ పార్టీ అభ్యర్థికి ఎక్కువగా మద్ధతు లభించడం సాధారణం. గత ఎన్నికల సమయంలో ఓటరు నమోదు ప్రక్రియను బీజేపీ చాలా క్రియాశీలకంగా వినియోగించుకుంది. ఈసారి కూడా అదే ఊపుతో కొత్త ఓటర్లను నమోది చేయించింది. ఇందుకోసం ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా ఓటర్ల సంఖ్య పెంచుకునేలా ఫ్లాన్ చేసింది.
గతంలో ఎన్నికలప్పుడు గోడల మీద రాతలు, పోస్టర్లు, కరపత్రాలు ప్రత్యక్షమయ్యేవి. తర్వాతి కాలంలో బ్యానర్లు, ఫ్లెక్సీలు, పోస్టర్లు, కటౌట్లు, ఎన్నికల వాగ్దానాలతో కూడిన బ్రోచర్లవంటివి వాడేవారు. ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియా హవా కొనసాగుతుందిద. క్షణాల్లో వేలాది మందికి గ్రూపుల ద్వారా పోస్టులు చేరుతుండటంతో అన్ని పార్టీల అభ్యర్థులూ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా టీమ్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇదే క్రమంలో భారతీయ జనతాపార్టీ ఓ అడుగు ముందుకేసి ప్రత్యేకించి మొబైల్ యాప్ను రూపొందించింది. రెండు సెగ్మెంట్లలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నకలకు సంబంధించి వివరాలతో ఓ మొబైల్ యాప్ను రూపొందించింది. ఎమ్మెల్సీ ఎన్నికల హామీలతోపాటు పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు వెల్లడించనున్నారు. అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇందులో పొందుపర్చనున్నట్లు సమాచారం.