Indian Railways : ఈ ఏడాది ఇప్పటివరకు భారత రైల్వే 5900 కిలోమీటర్ల విద్యుద్ధీకరణ చేసినట్లు బోర్డు సభ్యులు, జోనల్ రైల్వే జనరల్ మేనేజర్లు, డివిజనల్ రైల్వే మేనేజర్లతో జరిగిన సమావేశంలో రైల్వే మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. ఇది భవిష్యత్తులో, భారతీయ రైల్వే విజయాన్ని సూచిస్తుందని పియూష్ గోయల్ పేర్కొన్నారు. రైల్వేలకు ఈ సంవత్సరం అత్యంత సవాలుగా ఉన్న సంవత్సరమని, కోవిడ్ 19 నుంచి బయటపడటానికి రైల్వే తన సంకల్పాన్ని ప్రదర్శించిందని కొనియాడారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలను సృష్టించిందన్నారు.
ఈ సందర్భంగా స్వయం ప్రతిపత్తి, సమయస్ఫూర్తి, ప్రయాణికుల భద్రతే ముఖ్యమని పేర్కొన్నారు. 1223 మెట్రిక్ టన్నుల ఫ్రైట్ లోడింగ్ దేశానికి అనుకూలమైన సందేశం అన్నారు. లోడింగ్ పెంచడానికి, కొవిడ్ సమయంలో రైల్వే సిబ్బంది చూపిన తెగువను అభినందించారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రైల్వే అధికారులు సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. 2021 మార్చి నెలలో లోడింగ్, సంపాదన మరియు వేగం పరంగా సరుకు రవాణా గణాంకాలలో అధిక వేగాన్ని కొనసాగించాలని భారత రైల్వే పేర్కొంది. గత ఏడాది మొత్తం సరుకు రవాణా గణాంకాలను ఇది అధిగమిస్తుందని ఆకాంక్షించారు.