ప్రస్తుతం కోలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తోన్న క్రేజీ హీరోయిన్లలో ప్రియా భవానీ శంకర్ ఒకరు. ఇటీవలే కమల్ హాసన్ నటించిన భారతీయుడు 2 సినిమాలోనూ నటించిందీ అందాల తార. అంతకు ముందు ధనుష్, విశాల్, శింబు, కార్తి తదితర స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది ప్రియ. అన్నట్లు ఈ ముద్దుగుమ్మ తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా పరిచయమే. సంతోష్ శోభన్ తో కలిసి కల్యాణం కమనీయం అనే సినిమాలో నటించిందామె. అలాగే అక్కినేని నాగ చైతన్యతో కలిసి ధూత వెబ్ సిరీస్లో కనిపించింది. అలాగే గోపీచంద్ భీమా సినిమాలోనూ హీరోయిన్ గా మెప్పించింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ప్రియా భవానీ శంకర్ త్వరలోనే తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది. బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెప్పేసి తన ప్రియుడితో కలిసి పెళ్లిపీటలెక్కుతోంది. రాజ్ అనే వ్యక్తితో పదేళ్లుగా ప్రేమలో ఉన్నానన్న ప్రియా.. వచ్చే ఏడాది కచ్చితంగా పెళ్లిచేసుకుంటానంది. దీంతో ఈ నటి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అభిమానులు, నెటిజన్లు ఆమెకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
‘నేను సినిమా ఇండస్ట్రీలోకి రాక ముందునుంచే రాజ్తో ప్రేమలో ఉన్నాను. అయితే మేమిద్దరం బ్రేకప్ చెప్పుకున్నామంటూ ఇప్పటికే ఎన్నోసార్లు పుకార్లు షికార్లు చేశాయి. మేం వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పటివరకూ నేను చాలామంది నటులతో కలిసి పని చేశాను. వారితో ఉన్న చనువు, స్నేహం కారణంగా పుట్టిన రోజు లేదా ఏదైనా ప్రత్యేక సందర్భంలో వారికి విషెస్ చెబుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టేదాన్ని. అంతే.. అలా పోస్ట్ పెట్టడమే ఆలస్యం.. హీరోలతో నాకు రిలేషన్ కట్టబెట్టేవారు. అదృష్టం కొద్దీ ఇప్పుడు నాతో నటించిన హీరోల్లో దాదాపు అందరికీ పెళ్లయిపోయంది’ అని చెప్పుకొచ్చిందీ అందాల తార.
ప్రస్తుతం ‘డెమోంటే కాలనీ 2’ సినిమాలో నటిస్తోంది ప్రియా భవానీ శంకర్. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్లోనే ఆమె పెళ్లి గురించి ప్రస్తావించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.