ఏపీలో మరో 15 మందికి కరోనా..329కి చేరిన పాజిటివ్ కేసులు
ఏపీ, తెలంగాణ సహా 11 రాష్ట్రాల్లో మహమ్మారి మరింత ఉద్ధృతంగా ఉంది. తాజాగా ఏపీలో మరో 15 మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయినట్లుగా..
కోవిడ్- 19ః మహమ్మారి వైరస్ విశ్వరూపం ప్రదర్శిస్తోంది. రోజురోజుకూ విస్తరిస్తూ తన ప్రతాపం చూపిస్తోంది. ప్రాణాంతక వైరస్ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రెండో దశను దాటి సామూహిక వ్యాప్తిలోకి ప్రవేశించినట్టు ఎయిమ్స్ సైతం ధ్రువీకరించింది. ఏపీ, తెలంగాణ సహా 11 రాష్ట్రాల్లో మహమ్మారి మరింత ఉద్ధృతంగా ఉంది. తాజాగా ఏపీలో మరో 15 మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయినట్లుగా అధికారులు వెల్లడించారు.
ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 329కి చేరింది. మంగళవారం రాత్రి 10 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు నమోదైన లెక్కల ప్రకారం ఈ మేరకు బులిటెన్ విడుదల చేశారు. నెల్లూరులో 6, కృష్ణా 6, చిత్తూరు జిల్లాల్లో 3 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. అత్యధికంగా కర్నూలులో 74 కేసులు నమోదయినట్టు తెలిపింది.
వేగంగా విస్తరిస్తోన్న కరోనా వ్యాధి నిర్ధాణ పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్రంలో మొత్తం 11 ల్యాబ్లను ఏర్పాటు చేశారు. వీటిలో విజయవాడ, తిరుపతి, గుంటూరు, అనంతపురం, కాకినాడ, విశాఖ, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఏర్పాటు చేశారు. వీలైనంత ఎక్కువ పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణను వేగవంతం చేస్తున్నారు. పాజిటివ్ వస్తే ఆయా ప్రాంతాలను జల్లెడపట్టి వారితో సంబంధాలు నెరపినవారిని గుర్తించి వారిని క్వారంటైన్కు తరలించడం, రక్తపరీక్షలు నిర్వహించడం చేయడం ద్వారా కరోనా చైన్ను బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.