NEET 2021: నీట్ ఎగ్జామ్‌కు సర్వం సిద్ధం.. పరీక్ష రాయనున్న 16 లక్షల మంది విద్యార్థులు

|

Sep 11, 2021 | 7:07 PM

మెడికల్ కళాశాలలో ప్రవేశాల కోసం జరిగే నీట్ ఎగ్జామ్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ఆదివారంనాడు (సెప్టెంబర్ 12న) ఆఫ్లైన్లో జరగనున్న నీట్‌ ఎగ్జామ్ కు దాదాపు 16 లక్షల మంది హాజరుకానున్నారు.

NEET 2021: నీట్ ఎగ్జామ్‌కు సర్వం సిద్ధం.. పరీక్ష రాయనున్న 16 లక్షల మంది విద్యార్థులు
Neet Exam
Follow us on

NEET 2021:  మెడికల్ కళాశాలలో ప్రవేశాల కోసం జరిగే నీట్ ఎగ్జామ్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. 202 నగరాల్లో 3,842 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. దేశవ్యాప్తంగా ఆదివారంనాడు (సెప్టెంబర్ 12న) ఆఫ్లైన్లో జరగనున్న నీట్‌ ఎగ్జామ్ కు దాదాపు 16 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు లక్ష మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. ఏపీలోని 9 పట్టణాల్లో 151 పరీక్షా కేంద్రాలు, తెలంగాణలో 7 పట్టణాల్లో 112 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమయ్యే నీట్ పరీక్ష మూడు గంటల పాటు జరగనుంది. మధ్యాహ్నం 1.30 గం.ల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు అనుమతించబోమని అధికారులు స్పష్టంచేశారు. తప్పనసరిగా మాస్క్ ధరించడం వంటి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది. థర్మల్ స్క్రీనింగ్ తర్వాత విద్యార్థులను పరీక్షా కేంద్రంలోనికి అనుమతిస్తారు.

పరీక్షలో మార్పులు..నిబంధనలు మరవొద్దు..

ఈసారి నీట్ లో స్వల్ప మార్పులు చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA). ఇద్దరికి ఒకే మార్కులు వస్తే, నెగెటివ్‌ మార్కులు తక్కువగా వచ్చిన వారికి ముందు ర్యాంకు ఇవ్వనుంది ఎన్టీఏ. ఈ సారి నీట్ ఎగ్జామ్ లో ప్రతి సబ్జెక్టుకు 5 ప్రశ్నలు అదనం గా ఇవ్వనున్నారు. గతంలో మొత్తం 180 ప్రశ్నలిచ్చేవారు. అన్నిటికీ సమాధానాలు రాయాల్సి ఉండేది. ఈసారి ప్రతి సబ్జెక్టుకు 5 ప్రశ్నల చొప్పున కలిపారు. ఒక్కో సబ్జెక్టులో 50 ప్రశ్నల చొప్పున మొత్తం 200 ప్రశ్నలిస్తారు. వాటిలో జవాబులు రాయాల్సింది. 180 ప్రశ్నలకు మాత్రమే. సమయం మూడు గంటలే ఉంటుంది. ప్రతి సబ్జెక్టుకు ‘ఎ’ సెక్షన్‌లో 35 ప్రశ్నలుంటాయి. అన్నీ రాయాలి. ‘బి’ సెక్షన్‌లోని 15 ప్రశ్నల్లో 10 రాయాలి.

వృక్ష, జంతుశాస్త్రాల్లో జ్ఞాపకశక్తి ఆధారంగా ఇచ్చే ప్రశ్నలు 60 శాతానికి పైగా ఉంటాయి. డయాగ్రామ్స్ ఆధారంగా ఇచ్చే అంశాలు… కణ విభజన (సెల్‌ డివిజన్‌), వాటి దశలు, ఫ్లో ఛార్టులు, మొక్కల్లో చీడలు, క్రిమికీటకాల వంటివి గుర్తుపెట్టుకోవాలి.

ఈసారి 20 ప్రశ్నల మేరకు వెసులుబాటు కల్పించారు. కానీ ఇందులో సరిగ్గా అంచనా వేయకపోతే విద్యార్థులు నష్టపోతారు. ఎందుకంటే 3 గంటల్లోనే 200 ప్రశ్నలూ చదవాలి. అదనపు ప్రశ్నలు చదివితే తప్ప.. వేటిని ఎంచుకోవాలనే స్పష్టత రాదు. ఇది విద్యార్థులకు సవాలే. మరింత చురుగ్గా ఆలోచించాలి. ముందు నుంచే సాధన అవసరం. మోడల్‌ ఓఎంఆర్‌ షీట్‌ను ఎన్‌టీఏ ఆన్‌లైన్‌లో ఉంచింది. దీనిని సాధన చేసిన విద్యార్థులు ఈసారి ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంది.

నీట్‌లో ర్యాంకును నిర్ణయించేది భౌతికశాస్త్రమే. ఎక్కువ మంది కష్టంగా భావించేదీ ఈ భౌతిక శాస్త్రాన్ని. ఇంటర్‌ సెకండ్ ఇయర్ సిలబస్‌ కొంత సులభంగా ఉంటుంది. అందులో ఎక్కువ స్కోర్‌కు అవకాశం ఉంది. ఆధునిక భౌతికశాస్త్రం (మోడర్న్‌ ఫిజిక్స్‌), ఆప్టిక్స్‌లో ఎక్కువ స్కోర్‌ చేయవచ్చు. కష్టమైన రొటేషనల్‌ మెకానిక్స్‌, థర్మోడైనమిక్స్‌ లాంటి అంశాల పై పూర్తి పట్టు ఉంటే ఎక్కువ స్కోర్ సాధించవచ్చు.

ఇన్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో ఆర్డర్స్‌ సంబంధిత అంశాలు, ఫిజికల్‌ కెమిస్ట్రీలో ఫార్ములేషన్లు, యూనిట్లు, ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో నేమ్డ్‌ రియాక్షన్లు, రీఏజెంట్లను రివిజన్‌ చేసుకోవాలి. సంబంధిత గ్రాఫ్స్‌ (పట్టిక) పరిశీలించాలి. తప్పు, ఒప్పు తరహా ప్రశ్నల్లో గందరగోళం పడకుండా, వాటిని బాగా అర్థ చేసుకోవాలి.

(వెంకట రత్నం, టీవీ9 తెలుగు, హైదరాబాద్)

Also Read..

ఐపీఎల్‌ కోసం అబుదాబి చేరుకున్న రోహిత్‌ శర్మ.. సెప్టెంబర్ 19 న చెన్నై వర్సెస్‌ ముంబై ఇండియన్స్..

ఏపీ కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు.. ఒక్కరోజులో గణనీయంగా తగ్గిన కేసులు.. పెరిగిన మరణాలు..!