స్టాక్ మార్కెట్ బ్యాంకింగ్, లోహ, స్థిరాస్తి రంగాల షేర్ల అండతో కొత్త శిఖరాల్లోకి దూసుకెళ్లింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్ 221 పాయింట్లకు పైగా లాభంతో సరికొత్త రికార్డులో స్థిరపడగా.. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 12,000 మార్క్కు కొద్ది దూరంలో నిలిచింది. ఈ ఉదయం మార్కెట్లు నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. మార్కెట్ ఆరంభంలో సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడ్ అయ్యింది. అయితే ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటామోటార్స్ లాంటి దిగ్గజ రంగాల షేర్లలో కొనుగోళ్ల అండతో నష్టాల నుంచి కోలుకున్న సూచీలు మధ్యాహ్నం సెషన్లో రికార్డు స్థాయిలో దూసుకెళ్లాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ ఏకంగా 350 పాయింట్లకు పైగా లాభంతో 40,607 వద్ద సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయిని తాకింది. అటు నిఫ్టీ కూడా ఒక దశలో 12వేల మార్క్ పైన కదలాడింది. అయితే చివర్లో లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో సూచీలు కాస్త ఒత్తిడికి గురయ్యాయి. నేటి సెషన్లో సెన్సెక్స్ 221 పాయింట్లు లాభపడి 40,470 వద్ద, నిఫ్టీ 48 పాయింట్ల లాభంతో 11,966 వద్ద స్థిరపడ్డాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 70.99గా కొనసాగుతోంది.