దేశంలో ‘యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్’ (యూపీఐ) సేవలు భారీగా పెరుగుతున్నాయి. రకరకాల యూపీఐ యాప్స్ అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో ప్రతీ ఒక్కరూ కచ్చితంగా యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు. చిన్న టీ కొట్టు నుంచి పెద్ద పెద్ద సూపర్ మార్కెట్ల వరకు అన్నింటిలో యూపీఐ పేమెంట్స్ను స్వీకరిస్తున్నారు. దీంతో గూగుల్పే, ఫోన్పే, పేటీఎమ్ వంటివి మాత్రమే కాకుండా అన్ని రకాల బ్యాంకులు సొంతంగా యూపీఐ పేమెంట్ ఫీచర్లను ప్రవేశపెడుతున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా ఫుడ్ డెలివరీ యాప్స్ సైతం ఈ రంగంలోకి అడుగుపెట్టాయి. ప్రముఖ ఫుడ్ డెలివరి యాప్ జొమాటో ఇప్పటికే యూపీఐ సేవలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ సైతం యూపీఐ సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం స్విగ్గీలో ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే యూపీఐ పేమెంట్ చేయాలంటే మరో యాప్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. అయితే ఇకపై ఆ సమస్య లేకుండా స్విగ్గీ యాప్లోనే పేమెంట్స్ చేసుకోవచ్చు.
పేమెంట్ ఫెయిల్యూర్ రిస్క్ తగ్గడంతో పాటు యూజర్ వెంటనే పేమెంట్ చేసే విధంగా ఈ ఫీచర్ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఇక స్విగ్గీ ఈ సేవలను యస్ బ్యాంక్, జస్పే భాగస్వామ్యంతో తీసుకొస్తోంది. అయితే జొమాటో తీసుకొచ్చిన యూపీఐ సేవలు పూర్తి స్థాయిలో గూగుల్ పే, ఫోన్పే తరహాలో పనిచేస్తాయి. జొమాటో ఇందుకోసం ఆర్బీఐ నుంచి అనుమతులు సైతం తీసుకుంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్లో ఉన్న ఈ కొత్త ఫీచర్ను త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నెల రోజుల నుంచి ఎంపిక చేసిన కొందరు యూజర్లకు ఈ ఫీచర్ను అందించారు. లోటుపాట్లను సరిద్దుకొని స్విగ్గీ యూపీఐ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే యూపీఐ సేవలను ఇప్పటికే ఈకామర్స్ సంస్థలన్నీ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అమెజాన్, ఫ్లిప్కార్ట్లు సైతం నేరుగా తమ యాప్లోనే పేమెంట్స్ చేసే విధానాన్ని తీసుకొచ్చాయి. దేశంలో భారీగా పెరుగుతోన్న డిజిటల్ మార్కెట్ను హస్తగతం చేసుకోవాలని కంపెనీలు భావిస్తున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..