టెస్లా సీఈవో ఎలాన్మస్క్.. గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఏరోస్పేస్ నుంచి కార్ల తయారీ వరకు తనదైన ముద్ర వేస్తూ ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా నిలిచారు. వ్యాపారంలో కొంగొత్త ఒరవడి సృష్టిస్తూ ప్రపంచ వ్యాపారంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న మస్క్ తాజాగా మరో అద్భుతానికి శ్రీకారం చూట్టారు.
టెస్లా నుంచి అద్బుతమైన ప్రొడక్ట్స్ను తీసుకొస్తున్నట్లు ప్రకటించి మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. కాలిఫోర్నియాలోని వార్నర్ బ్రదర్స్ ప్రాంగణంలో నిర్వహించిన వీరోబో కార్యక్రమంలో టెస్లా తయారు చేసిన రోబో వ్యాన్ను ప్రపంచానికి పరిచయం చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఇప్పటి వరకు టెస్లా నుంచి వచ్చిన వాహనలు కొంతమంది మాత్రమే ప్రయణించేందుకు వీలుగా ఉండేవి. అయితే ఇప్పుడు తీసుకొస్తున్న ఈ రోబోవ్యాన్ సాధారణ డిజైన్లకు పూర్తి భిన్నంగా ఉంది. ఇందులో 20 మంది ప్రయాణించొచ్చు.
ఇక దీని డిజైన్ వైవిధ్యంగా ఉంది. వాహన టైర్స్ బయటకు కనిపించకపోవడం ఈ రోబోవ్యాన్ ప్రత్యేకతగా చెప్పొచ్చు. అత్యంత తక్కువ ఖర్చులోనే ఈ వాహనంలో ప్రయాణించవచ్చు. టెస్లా బృందం తెలిపిన వివరాల ప్రకారం మైలు దూరం ప్రయాణించడానికి కేవలం 5 నుంచి 10 సెంట్లు మాత్రమే ఖర్చవుతుంది. అటానమస్ సెల్ఫ్ డ్రైవింగ్ కోసం నిర్మించారు.
Robotaxi & Robovan pic.twitter.com/pI2neyJBSL
— Tesla (@Tesla) October 11, 2024
ఇక టెస్లా నుంచి రోబో ట్యాక్సీని కూడా తీసుకొస్తున్నారు. రెండు డోర్లతో ఉన్న ఈ కారుకు స్టీరింగ్ వీల్, పెడల్స్ లేవు. దానిని మస్క్ సైబర్ క్యాబ్ అని ప్రేక్షకులకు పరిచయం చేశారు. దీని తయారీ 2026 నుంచి మొదలవుతుందని మస్క్ తెలిపారు. ధర విషయానికొస్తే ఈ వాహనం ధర రూ. 25 లక్షల వరకు ఉండొచ్చని అంచా వేస్తున్నారు. ఇక వీటితో పాటు మస్క్ ఈ కార్యక్రమంలో రోబోలను కూడా ప్రదర్శించారు. ఇంట్లో అన్ని రకాల పనులు చేసిపెట్టి, ఒక స్నేహితుడిలాగా ఈ రోబో పనిచేయనుందని మస్క్ తెలిపారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
— Elon Musk (@elonmusk) October 11, 2024
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..