విశాఖపట్నంతో తనకు విడదీయరాని బంధం ఏర్పడిందని…అలాంటి నగరాన్ని విడిచిపెట్టి వెళుతున్నందుకు బాధగా ఉందని ప్రముఖ ఐఏఎస్ ఆఫీసర్ గుమ్మళ్ల సృజన ఆవేదన చెందారు. ఇన్ని రోజులు జీవీఎంసీ కమిషనర్గా సేవలందించిన ఆమె పరిశ్రమల శాఖ డైరెక్టర్గా బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నగర మేయర్ హరి వె౦కటకుమారి ఆధ్వర్యంలో మంగళవారం విశాఖలోని ఓ ప్రైవేటు హోటల్లో ఆమెకు వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విశాఖతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సృజన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
మన కుటుంబంలో వారి జోక్యమెందుకు?
‘విశాఖ నగరం నాకు సొంత నగరం లాంటిది. నేను సెటిలైన హైదరాబాద్లో కూడా నాకు ఇంత మంది ఆత్మీయులు లేరు. అలాంటి నగరాన్ని విడిచిపెట్టి పోతున్నందుకు బాధగా ఉంది. నగర ప్రజలకు గౌరవప్రదమైన జీవనాన్ని అందించాలనే ఉద్దేశంతోనే నా విధులు నిర్వర్తించాను. జీవీఎంసీ అధికారులు, ఉద్యోగులు, కార్పొరేటర్లందరూ ఒకే కుటుంబ సభ్యులు. సమస్యలు వస్తే మనమే పరిష్కరించుకోవాలి. ఇతరుల ప్రమేయానికి అవకాశం కల్పించకూడదు. నా ఇంటి వద్ద పనిచేసే వ్యక్తిగత సిబ్బంది నన్ను తమ కుటుంబ సభ్యురాలిలా చూసుకున్నారు. వారి సహకారంతోనే నా విధులు సమర్థంగా నిర్వహించాను. విధి నిర్వహణలో భాగంగా ఎవరినైనా ఇబ్బంది, బాధ పెట్టి ఉంటే క్షమించండి’ అని చెప్పుకొచ్చారు సృజన. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ డిప్యూటీ మేయర్లు, ఫ్లోర్ లీడర్లు, స్టాండింగ్ కమిటీ సభ్యులు, కార్పొరేటర్లు పాల్గొని కమిషనర్ను ఘనంగా సత్కరించారు.
Also Read: