Andhra Pradesh: కోర్టులో దొంగలు పడ్డారు.. కీలక పత్రాలు ఎత్తుకెళ్లారు.. పూర్తి వివరాలు తెలిస్తే షాక్

|

Apr 15, 2022 | 7:39 AM

సాధారణంగా తాళం వేసి ఉన్న ఇళ్లల్లో దొంగలు పడి ఉన్నదంతా దోచుకెళ్తారు. కానీ ఈ దొంగతనం మాత్రం అందరినీ షాక్ కు గురి చేసింది. ఇంతకీ ఈ దొంగతనం ఎక్కడ జరిగిందో తెలిస్తే మీరూ హవ్వా ఇదేం పని అని అంటారు. నెల్లూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి...

Andhra Pradesh: కోర్టులో దొంగలు పడ్డారు.. కీలక పత్రాలు ఎత్తుకెళ్లారు.. పూర్తి వివరాలు తెలిస్తే షాక్
Theft In Nellore Court
Follow us on

సాధారణంగా తాళం వేసి ఉన్న ఇళ్లల్లో దొంగలు పడి ఉన్నదంతా దోచుకెళ్తారు. కానీ ఈ దొంగతనం మాత్రం అందరినీ షాక్ కు గురి చేసింది. ఇంతకీ ఈ దొంగతనం ఎక్కడ జరిగిందో తెలిస్తే మీరూ హవ్వా ఇదేం పని అని అంటారు. నెల్లూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కేసులో పత్రాలు, స్టాంపులు, ఇతర పరికరాలున్న సంచి అపహరణకు గురైనట్లు కోర్టు బెంచి క్లర్కు స్థానిక చిన్నబజారు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. నెల్లూరు(Nellore) కోర్టు సముదాయంలోని నాలుగో అదనపు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో(Court) బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడ్డారు. ఓ కేసులో కీలకంగా మారిన పత్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులను ఎత్తుకెళ్లారు. గురువారం ఉదయం కోర్టుకొచ్చిన సిబ్బంది దొంగతనం జరిగినట్లు గుర్తించారు. ఈ విషయమై పోలీసులకు సమాచారమిచ్చారు. దొంగతనానికి గురైన సంచిని కోర్టు బయట ఉన్న కాలువలో పోలీసులు గుర్తించారు. అందులో ఉండాల్సిన పలు డాక్యుమెంట్లు మాయమైనట్లు గుర్తించి.. దర్యాప్తు చేపట్టారు.

సర్వేపల్లి ఎమ్మెల్యే, వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. 2017లో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై పలు విమర్శలు చేశారు. వివిధ పత్రాలు చూపించి హవాలాకు పాల్పడ్డారని ఆరోపించారు. దానిపై సోమిరెడ్డి తప్పుడు పత్రాలు చూపించి తనపై బురద జల్లుతున్నారని కాకాణి గోవర్ధన్‌రెడ్డితో పాటు మరికొందరిపై కేసు పెట్టారు. కాకాణిపై పరువునష్టం దావా దాఖలు చేశారు. ఈ కేసు విచారణ 4వ అదనపు జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో జరిగింది. ఈ కేసులో ఏ2గా ఉన్న చిత్తూరు జిల్లాకు చెందిన పసుపులేటి చిరంజీవి.. ఆ కేసులో నకిలీ పత్రాలు రూపొందించినట్లు గుర్తించారు. ప్రస్తుతం పోలీసులకు లభ్యమైన పత్రాలు చిరంజీవికి చెందినవని గుర్తించినట్లు తెలుస్తోంది.

Also Read