పోలవరం (Polavaram) ప్రాజెక్టు నిర్వాసితులపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి స్పందించారు. బాధితులకు న్యాయం చేయాలని, ప్రభుత్వ సహాయం పెంచాలంటూ సీఎస్ కు లేఖ రాశారు. వారికి ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గోదావరి (Godavari) వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారని లేఖలో వెల్లడించారు. వేల కుటుంబాలను చిన్నాభిన్నమయ్యాయని, భారీ నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. ప్రభుత్వం నుంచి బాధితులకు సరైన సహాయం అందలేదనే విషయం తన పర్యటన ద్వారా అర్థమైందని లేఖలో వివరించారు. హుద్హుద్, తిత్లీ తుపాను సమయంలో టీడీపీ ప్రభుత్వం బాధితులకు పరిహారం పెంచిందన్న విషయాన్ని గుర్తు చేశారు. అప్పటితో పోలిస్తే ప్రస్తుతం పెరిగిన ధరలు, జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని వరద సహాయం మరింత పెంచాలని కోరారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధిత కుటుంబానికి రూ. 10వేలు చొప్పున ఆర్థిక సాయం అందించాలని చంద్రబాబు స్పష్టం చేశారు.
పూర్తిగా దెబ్బతిన్న ఇంటికి రూ.25వేలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇంటికి రూ.10 వేలు అందించాలి. హెక్టారుకు కనీసం రూ.25వేలు, ఆక్వాకల్చర్కు రూ.50వేలు ఇవ్వాలి. వరదల కారణంగా చనిపోయిన వ్యక్తికి రూ.10లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. దశల వారీగా పరిహారాన్ని తొలగించి, అందరికీ ఒకేసారి పరిహారం ఇవ్వాలి. భవిష్యత్ తరాల కోసం సర్వం త్యాగం చేసిన వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
– నారా చంద్రబాబునాయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి
మరోవైపు.. గోదావరి వరదల తర్వాత పోలవరం ప్రాజెక్టును మొట్టమొదటిసారిగా CWC కమిటీ పరిశీలించింది. సీడబ్ల్యూసీ డైరెక్టర్ ఖయ్యూం మహ్మద్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బృందం ప్రాజెక్టు స్థితిగతులపై అధ్యయనం చేశారు. గోదావరికి వరదలు పోటెత్తడం, అనేక ప్రాంతాలు నీట మునగడంతో పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై విమర్శలు చెలరేగాయి. తెలంగాణ నుంచి అనేక అభ్యంతరాలు వచ్చాయి. పోలవరం ప్రాజెక్టు కారణంగా టెంపుల్ టౌన్ భద్రాచలం మునిగిపోయిందన్న తెలంగాణ ఈఎన్సీ లేఖపైనా సీడబ్ల్యూసీ దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి