ప్రపంచానికే భారతదేశం ఆదర్శంగా నిలిచిందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు (Chandrbabu Naidu) అన్నారు. దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. జాతీయ జెండా స్పూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆజాదీ కా అమృతోత్సవ్ గుండెల్లో నినాదంగా మారాలని చెప్పారు. దేశభక్తిని పెంచుతూ దేశాన్ని నెంబర్ వన్ గా తయారు చేయటానికి అందరూ కలిసి పని చేయాలని కోరారు. దేశభక్తి పెరగాలంటే జాతీయ నాయకుల త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. స్వాతంత్ర్యం నా జన్మహక్కు అంటూ పోరాడాంలని పిలుపునిచ్చారు. దేశ చరిత్రలో దేశం ఉన్నంత వరకూ మిగిలిపోయే వ్యక్తి పింగళి వెంకయ్య అని.. భవిష్యత్ కి పునరంకితం కావాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. ప్రపంచానికే భారతదేశం ఆదర్శంగా నిలిచిందన్న చంద్రబాబు.. ప్రపంచంలోని మేధావులు చాలా వరకు మన దేశంలోనే ఉన్నారని చెప్పారు. దేశానికి ఆర్థిక సంస్కరణలు అవసరమని పీవీ నరసింహారావు చెప్పిన తర్వాత, ఆయన చేసిన చొరవ కారణంగానే దేశం అభివృద్ధిలో శరవేగంగా దూసుకుపోతోందని పేర్కొన్నారు.
ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో సీనియర్ ఎన్టీఆర్ సినిమా రంగాన్ని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారన్నారు. దేశం ముందు తర్వాతే వ్యక్తులు అనే భావన అందరిలోనూ కలగాలని చెప్పారు. కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ లో అన్ని రంగాలు మూతపడ్డాయి. కానీ వ్యవసాయం రంగం మాత్రం తన బాధ్యతను నిర్వర్తించింది. ఆ సమయంలో రైతులు లాక్ డౌన్ చేయలేదు. ఆలా చేసి ఉంటే ఇప్పుడు తీవ్ర ఆహార సంక్షోభం ఎదుర్కోవాల్సి వచ్చేది. రైతులే నిజమైన దేశభక్తులు అని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సంస్కరణలు వచ్చినప్పుడు టీడీపి సమర్థవంతంగా ఉపయోగించుకుందన్నారు. దేశ సమగ్రత కోసం టీడీపీ పని చేసిందని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి గుర్తు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి