ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లి జిల్లా డిమాండ్ మళ్ళీ తెర మీదికి వచ్చింది. జిల్లాల విభజన సమయంలో పార్లమెంట్ నియోజకవర్గాలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం రాజంపేట పార్లమెంట్ను అన్నమయ్య జిల్లాగా చేసింది. రాజంపేట పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఆరు అసెంబ్లీలను కలిపి అన్నమయ్య జిల్లాగా ప్రకటించిన ప్రభుత్వం రాయచోటి జిల్లా కేంద్రంగా నోటిఫికేషన్ జారీ చేసింది. పరిపాలన సౌలభ్యంతో పాటు జిల్లా కేంద్రం ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో రాయచోటిని జిల్లా కేంద్రం చేసింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, మదనపల్లి, తంబళ్లపల్లి, పీలేరు నియోజకవర్గాలు రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఉండగా పుంగనూరును చిత్తూరు జిల్లాలోనే కొనసాగిస్తూ మిగతా మూడు నియోజకవర్గాలను అన్నమయ్య జిల్లాలో పరిధిలో ఉంచింది. రాయచోటి జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లాపై గెజిట్ విడుదల చేసిన ప్రభుత్వం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లి, పీలేరు, తంబళ్లపల్లితోపాటు ఉమ్మడి కడప జిల్లాలోని రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాలను అన్నమయ్య జిల్లా పరిధిలో ఉంచింది.
దీంతో ఎప్పటినుంచో ఉన్న మదనపల్లి జిల్లా డిమాండ్ కల నెరవేరక పోవడంతో ఇప్పుడు మరోసారి జిల్లా చేయాలంటూ సమరభేరి పేరుతో సకలజనులు పోరుబాట ప్రారంభించారు. వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు మదనపల్లి జిల్లా నినాదంతో రోడ్డెక్కాయి. పుంగనూరు, పీలేరు, తంబల్లపల్లె ను కలిపి మదనపల్లిని జిల్లా చేయాలని డిమాండ్ రోడ్డు ఎక్కింది. అవసరమైతే పక్కనే ఉన్న సత్యసాయి జిల్లాలోని కదిరి, అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని కూడా కలిపి 6 నియోజకవర్గాలతో మదనపల్లి జిల్లా కేంద్రంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తెరమీదికి వస్తోంది. మదనపల్లి జిల్లా కోసం గతంలో పెద్ద ఎత్తున నిరసనలు, ర్యాలీలు చేపట్టిన స్థానికులు ఇప్పుడు ఎన్నికల సమయంలో మళ్లీ జిల్లా నినాదంతో అఖిలపక్షం ఆధ్వర్యంలో సకల జనుల ర్యాలీ చేపట్టారు. ఆటోలు, ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించిన అఖిలపక్షం నేతలు జిల్లా సాధనే ద్యేయమంటూ పోరుబాట చేపట్టారు. సమర భేరి పేరుతో సకల జనుల ఐక్యతను చాటుతూ ర్యాలీ నిర్వహించారు. మదనపల్లి ఇండస్ట్రీయల్ ఎస్టేట్, గొల్లపల్లి సర్కిల్, చౌడేశ్వరి గుడి సర్కిల్, నీరుగట్టువారి పల్లె, ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా అంబేద్కర్ సర్కిల్ వరకూ ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో టిడిపి ఇన్ ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే రమేష్, జనసేన రాయలసీమ కో కన్వీనర్ రాందాస్ చౌదరి, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..