ఆ వర్సిటీని పార్టీ ఆఫీసుగా మార్చారంటూ విమర్శలు.. వీసీ పదవికి ప్రొఫెసర్ రాజీనామా..

| Edited By: Srikar T

Jun 29, 2024 | 2:58 PM

ఆంధ్రా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాద్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్‎కు తన రాజీనామా లేఖను పంపారు. నాలుగు సంవత్సరాలుగా ఏయూ వీసీగా కొనసాగుతున్న ప్రసాద్ రెడ్డి.. 1987 నుంచి ఆంధ్రా యూనివర్శిటీలో కంప్యూటర్స్ విభాగపు హెచ్‎ఓడీ, ప్రిన్సిపాల్, డీన్, రిజిస్ట్రార్, రెక్టార్‎గా పనిచేశారు.

ఆ వర్సిటీని పార్టీ ఆఫీసుగా మార్చారంటూ విమర్శలు.. వీసీ పదవికి ప్రొఫెసర్ రాజీనామా..
Visakhapatnam
Follow us on

ఆంధ్రా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాద్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్‎కు తన రాజీనామా లేఖను పంపారు. నాలుగు సంవత్సరాలుగా ఏయూ వీసీగా కొనసాగుతున్న ప్రసాద్ రెడ్డి.. 1987 నుంచి ఆంధ్రా యూనివర్శిటీలో కంప్యూటర్స్ విభాగపు హెచ్‎ఓడీ, ప్రిన్సిపాల్, డీన్, రిజిస్ట్రార్, రెక్టార్‎గా పనిచేశారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీసీ ప్రసాద్ రెడ్డి రాజీనామా ఆసక్తిని కలిగించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వీసీగా నియమితులైన ప్రసాద్ రెడ్డి.. అప్పటి అధికార పార్టీ నేతలకు అనుకూలంగా పనిచేశారన్న విమర్శలను ఎదుర్కొన్నారు. ప్రసాద్ రెడ్డి హయాంలో యూనివర్సిటీని అత్యున్నత స్థాయికి తీర్చిదిద్దారని అందువల్లే ఇప్పటివరకూ ఎప్పుడూ దక్కని న్యాక్ A++ అవార్డు వచ్చిందని ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ వీసీ కార్యాలయం విశాఖ రాజకీయ కార్యాలయంగా మారిందని టిడిపి విమర్శలు చేస్తోంది. అదే సమయంలో యూనివర్సిటీలో పదోన్నతుల్లో సామాజిక న్యాయం పాటించలేదని, కొంతమందిని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టారని, వివక్ష చూపారన్న విమర్శల ఎదుర్కొంది. కొందరు మాజీ ప్రొఫెసర్లతో పాటు ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వచ్చాయి. తాజా పరిణామాల నేపథ్యంలో వీసీ రాజీనామా అంశం విస్తృత చర్చికి దారితీసింది.

యూనివర్సిటీలతో 37 సంవత్సరాల అనుబంధం..

ప్రతిష్ఠాత్మక ఆంధ్రా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్‎పై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. 1987 నుంచి అంటే దాదాపు 37 సంవత్సరాలుగా ఆంధ్ర యూనివర్సిటీలో రిజిస్టర్, రెక్టార్గా, ప్రిన్సిపల్, హెచ్‎ఓడిగా అన్ని పరిపాలన స్థాయిల్లో పనిచేసిన ప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వైస్ ఛాన్స్లర్‎గా నియమితులయ్యారు. అంతకుముందు ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా యూనివర్సిటీల్లో విద్యార్థులతో చేసిన కార్యక్రమాల్లో అత్యుత్సాహం చూపారని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఆయన్ని సస్పెండ్ చేసింది. దాంతో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే ఆయనను వైస్ ఛాన్సలర్‎గా నియమించింది. వైస్ ఛాన్స్లర్‎గా వివిధ కంపెనీల సిఎస్ఆర్ నిధులను సమీకరించి యూనివర్సిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశారన్న పేరు ఉంది. కంపెనీల అవసరాలు కనుగుణంగా సిలబస్‎ను అనుసంధానిస్తూ ప్రాక్టికల్ విద్యకి ఎక్కువ ఆసక్తి చూపారు అన్న వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. అదే సమయంలో ఏహబ్‎ని ఏర్పాటు చేసి పలు ఔత్సాహక విద్యార్థుల స్టార్ట్ అప్‎లకు ప్రమోషన్ కల్పించే విధంగా చర్యలు తీసుకున్న ప్రసాద్ రెడ్డి హయాంలో యూనివర్సిటీకి మాక్ ఏ డబల్ ప్లస్ అవార్డు లభించింది.

యూనివర్సిటీ ప్రతిష్టని భ్రష్ఠు పట్టించారన్న టీడీపీ..

మరోవైపు పవిత్రమైన విద్యా సంస్థను ఒక రాజకీయ కేంద్రంగా మార్చారని అరోపిస్తున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ అంటే ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉండేదనీ.. కానీ ఇప్పుడు ఆంధ్రా యూనివర్సిటీ ప్రతిష్ఠను మసకబారేలా చేశారంటూ టీడీపీ విమర్శలు చేసింది. విద్యా ప్రమాణాలు పడిపోయాయని, విద్యలో నాణ్యత ఎప్పుడూ లేనంతగా దిగజారినపోయేలా చేశారనీ వైస్ ఛాన్సలర్ ప్రసాదరెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారు టీ ఎన్ ఎస్ ఎఫ్ నాయకులు. కంప్యూటర్ సైన్స్ విభాగంలోని తన ఆఫీసును వైసీపీ ఆఫీసుగా మార్చేసి, పార్టీ వ్యూహాలు, కార్యక్రమాలకు కేంద్రంగా తయారు చేశారని ఆచార్యుడి పదవికి మచ్చ తెచ్చేలా వ్యవహరించారంటున్నారు టీడీపీ నేతలు. ప్రసాద్ రెడ్డి వైస్ ఛాన్సలర్ అయ్యాక జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి పుట్టినరోజు వేడుకలు, పార్టీ కార్యకలాపాలు చేయడం మొదలు పెట్టారని మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు తాజాగా విమర్శించారు. అర్హతలున్న ఎంతోమంది ప్రొఫెసర్లు ఆంధ్రా యూనివర్సిటీలో ఉండగా ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్‎గా వచ్చిన స్టీఫెన్‎ను రిజిస్ట్రార్‎గా నియమించారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైస్ ఛాన్సలర్‎ను మార్చాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ మేరకు సాయంత్రం లోపు రాజీనామాను ఇవ్వాలని కోరింది. ఈ నేపథ్యంలోనే వీసీ ప్రసాద్ రెడ్డి రాజీనామా చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..